12వ తేదీ సంబ‌రాల్లో మోడీ.. రెండు కీల‌క రీజ‌న్లు!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈ నెల 12న సంబ‌రాల్లో మున‌గిపోనున్నారు. ఆయ‌న‌కు అత్యంత కీల‌క‌మైన రోజుగా ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం తాజాగా పేర్కొంది. ఈ నెల 12న ప్ర‌ధాని మోడీకి సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. దీనిలో ఆయ‌న పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఏపీకి, ఒడిశాకు కేటాయించారు. దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి త‌న బీజేపీ కూట‌మి అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైన కీల‌క నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తుండ‌డం.

ప్ర‌ధానిగా మోడీ ప్ర‌మాణం చేసిన స‌మ‌యంలో చంద్ర‌బాబు ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఢిల్లీకి వెళ్లి హాజ‌ర‌య్యారు. ఆసాంతం అక్క‌డే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్ర‌ధాని మోడీకూడా ఏపీకి రానున్నారు. ఈ నెల‌ 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యేక ఆహ్వానితులుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. విశిష్ట అతిథిగా మాత్రం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హాజ‌రు కానున్నారు.

ఈ నెల 12న ప్ర‌ధాని మోడీ ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి 11 గంటల వరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్ కు ప్రధాని వెళ్లనున్నారు. అయితే.. అక్క‌డ కూడా మోడీకి విశిష్ట కార్య‌క్ర‌మం ఉంది.

దాదాపు 25 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌.. ఎవ‌రూ త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చ‌లేర‌ని భావించిన ఒడిశా మాజీ ము ఖ్యమంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం తాజాగా కుప్ప‌కూలిపోయింది. బీజేపీ అక్క‌డ అధికారంలోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో భారీ ఎత్తున సంబ‌రాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. అదే 12వ తేదీన‌.. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో బీజేపీ ముఖ్యమంత్రిగా సురేష్ పూజారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని స‌మాచారం. దీంతో ఆ కార్య‌క్ర‌మానికి కూడా ప్ర‌ధాని మోడీ హాజ‌రుకానున్నారు. సో.. ఈ నేప‌థ్యంలో ఇటు వైపు ఏపీలోను, అటు ఒడిశాలోనూ ఒకే రోజు మోడీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది.