అమ‌రావ‌తికి కొత్త క‌ళ‌.. ఏం జ‌రిగిందంటే!

ఏపీ రాజ‌ధాని ప్రాంతం అమ‌రావతి గ‌త ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో మూల‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఒకప్పుడు నిలువెత్తు నిర్మాణాలు.. ఎటు చూసినా.. సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొన్న అమ‌రాతి ప్రాంతం జ‌గ‌న్ హయాంలో మాత్రం నిలువునా ఒణికి పోయింది. అయితే..రాష్ట్రంలో ప్ర‌జ‌లు అధికారం మార్పిడి చేయ‌డం తో ఇప్పుడు రాజ‌ధానిలో కొత్త క‌ళ క‌నిపిస్తోంది. ఎటు చూసినా.. ప‌నులు జ‌రుగుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ పేరుకుపోయిన చెత్త‌, అడ‌విని త‌ల‌పిస్తున్న ప్రాంతాల‌ను కూడా.. తొల‌గించారు.

మరోవైపు… యుద్ద‌ప్రాతిప‌దిక‌న‌.. స్మార‌క నిర్మాణాల‌ను శుభ్రం చేస్తున్నారు. అప్ప‌ట్లో ప్ర‌ధాని మోడీ శంకు స్థాప‌న చేసిన ప్రాంతాన్ని కూడా శుభ్రం చేసిన అలంక‌రిస్తున్నారు. ఇక‌, రాజధాని ప్రాంతంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(సిఎస్) నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ తాజాగా సుడిగాలి పర్యటన చేశారు. అసంపూర్తి నిర్మాణ పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి గతంలో భూమి పూజ జరిగిన ఉద్దండరాయుని పాలెం లోని సీఆర్డిఏ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు.

త‌ర్వాత‌ అఖిల భారత సర్వీసు అధికారుల నివాస సముదాయ భవనాలను, ఎంఎల్ఏల క్వార్టర్లు, ఏపీ ఎన్జీవో ల‌నివాసం భవనాలు సముదాయాలను పరిశీలించారు. అదేవిధంగా హైకోర్టు ప్రాంతం తదితర చోట్ల సిఎస్ పరిశీలన చేశారు. దీంతో ఇక్క‌డ ఏదో అద్భుతాలు జ‌ర‌గ‌నున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత‌.. రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నున్నారని తెలుస్తోంది. ఇక్క‌డి రైతుల‌ను అధికారికంగా ఆయ‌న భేటీ అవుతారని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.

అదే విధంగా నిర్మాణ ప‌నుల‌ను కూడా సాధ్య‌మైనంత వేగంగా చేప‌ట్టనున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. రైతుల‌కు ఇవ్వాల్సిన బ‌కాయిలు.. ఇత‌ర‌త్రా స‌దుపాయాల‌ను కూడా వ‌చ్చే ఆరు మాసాల్లోనే పూర్తి చేసి.. కోర్టుకు అఫిడ‌విట్లు స‌మ‌ర్పించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు అమ‌రావ‌తిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో వెళ్లిపోయిన‌ సంస్థ‌ల‌ను తిరిగి ఆహ్వానించ‌నున్న‌ట్టు తెలిసింది. అలాగే ప‌నులు కూడా ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం.