ఆఖరి నిముషం లో ఏపీ BJP MP కి మంత్రి పదవి

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరనుంది. ఈ రోజు రాత్రి 7.15 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆ వెంటనే బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 30 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ రోజు మోడీతోపాటు కేంద్ర మంత్రులుగా ఎవరెవరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నది తేలాల్సి ఉంది. పూర్తి స్థాయి మోడీ కేబినెట్ లో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇక, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌ నాయుడుకు కేబినెట్‌ మంత్రి పదవి దక్కగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కనుంది.

బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఈ ముగ్గురూ ప్రధానితో ఈ రోజే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే రామ్మోహన్‌నాయుడుకి, పెమ్మసానికి ఫోన్‌ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు దక్కింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పిలుపు అందింది. పీఎంవో నుంచి పిలుపు రావడంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మోదీ నివాసానికి వెళ్లారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకొని మంచి ఫలితాలు సాధించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు.