వైఎస్ విగ్ర‌హాల ధ్వంసం.. జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్‌!

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ కార్యాల‌యాలు.. నేత‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రుగుతున్నాయి. దీనికి గ‌తంలో వైసీపీ నాయ‌కులు రెచ్చ‌గొట్టేలా ప్ర‌సంగించార‌ని కొం ద‌రు చెబుతున్నా.. ఇది స‌రికాద‌నే వాద‌న మరోవైపు వినిపిస్తోంది. ఇక‌, గ‌త రెండు రోజుల నుంచి ప‌లు జిల్లాల్లోని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాల‌ను దుండ‌గులు ధ్వంసంచేస్తున్నారు. యూనివ‌ర్సిటీలు.. విద్యా ల‌యాలు, ప‌లుప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్ర‌హాల‌ను ప‌గుల గొడుతున్నారు.

దీంతో రాష్ట్రంలో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ప‌రిణామాలపై ఇప్ప‌టికే మాజీ సీఎం జ‌గ‌న్‌..గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశారు. అదేవిధంగా వ‌రుస‌గా ట్వీట్లు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద న్నారు. అంతేకాదు.. శాంతి భ‌ద్ర‌త‌లు క‌ట్టుత‌ప్పాయ‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజా గా అమ‌రావ‌తికి వ‌చ్చిన‌.. కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిల స్పందించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న వైఎస్ విగ్ర‌హాల ధ్వంసాన్ని త‌ప్పుబ‌ట్టారు.

గెలుపు ఓట‌ముల‌ను మ‌హానేత‌ల‌కు ఎలా అంట‌గ‌డ‌తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. ప్ర‌జాస్వామ్యంలో ఈ విధానం స‌రికాద‌ని పేర్కొన్నారు. వైఎస్‌ విగ్ర‌హాల‌ను కూల్చేసిన వారిని గుర్తించి.. త‌క్ష‌ణ‌మే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని ఆమె కోరారు. ఇదిలావుంటే.. మాజీ సీఎం ఏం చేస్తున్నారు? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. వైఎస్ విగ్ర‌హాలు కూల్చేస్తుంటే.. ఇంట్లో కూర్చుని ట్వీట్లు పెడుతున్నారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ సీఎం ఇంత‌క‌న్నా ఏమీచేయ‌డం చేత‌కాదా? అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా చ‌ర్య‌లు తీసుకునేలా రోడ్డు మీద‌కి రావాల‌ని ఆమె సూచించారు.