‘బీపీ వ‌చ్చి..’ వంశీ, కొడాలి ఇళ్ల‌పై దాడులు.. క‌సి తీర్చుకుంటున్నారా?

తాజా ఎన్నిక‌ల్లో త‌మ గెలుపు ఖాయ‌మ‌ని చెప్పిన ఉమ్మ‌డి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు ఘోరంగా ఓడిపో యారు. వారే గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని. వీరిద్ద‌రిపైనా టీడీపీ శ్రేణుల‌కు పీక‌ల వ‌ర‌కు ఆగ్ర‌హం ఉంది. ఎందుకంటే.. రాజ‌కీయంగా కంటే కూడా.. చంద్ర‌బాబు కుటుంబాన్ని ఘోరంగా అవ‌మానించార‌ని శ్రేణులు ఆవేద‌నలో ఉన్నాయి. నిండు అసెంబ్లీలోనే.. వంశీ.. చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై కామెంట్లు చేశార‌ని.. వీటిని నాని స‌మ‌ర్ధిం చార‌ని కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

పైగా.. ఎక్క‌డిక‌క్క‌డ ఎప్ప‌టిక‌ప్ప‌డు.. టీడీపీని కూడా వీరు టార్గెట్ చేయ‌డం.. నారా లోకేష్, చంద్ర‌బాబుపై ప‌రుష ప‌దజాల‌తో విరుచుకుప‌డిన ఘ‌ట‌నలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా టీడీపీ కూట‌మి అధికారంలోకి రావ‌డంతో ఆ పార్టీ శ్రేణులు.. వంశీ, కొడాలి ఇళ్ల‌పైకి దూసుకువెళ్లారు. రాళ్లు, కోడిగుడ్ల‌తో దాడులు చేశారు. దీంతో కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచే సుకుంది. టీడీపీ శ్రేణులు మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి పై దాడికి యత్నించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో కొంద‌రు టీడీపీ యువ‌త కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు రువ్వారు, కోడి గుడ్లు విసిరేశారు. నాని ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేశారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకుని అక్క‌డ నుంచి పంపించే ప్ర‌య‌త్నం చేశారు. వారు వెళ్తూ వెళ్తూ.. నాని ఇంటి ముందు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక‌, విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ స‌మీపంలోని వ‌ల్ల‌భ‌నేని వంశీ అపార్ట్‌మెంటు వ‌ద్ద కూడా టీడీపీ యువ‌త పెద్ద ఎత్తున దాడులు చేశారు. రాళ్లు రువ్వారు. కోడిగుడ్లు విసిరారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు అక్క‌డ మోహ‌రించి వారిని అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు.

మ‌రో వైపు గ‌న్న‌వ‌రంలోనూ వంశీ ఇంటి పైకి యువ‌త రాళ్లు, కోడిగుడ్లు రువ్వారు. మ‌రికొంద‌రు పేడ క‌లిపిన నీటిని జ‌ల్లారు. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు.. చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేస్తూ.. వారు కొంత హ‌డావుడి సృష్టించారు. అయితే.. ఆయా ఘ‌ట‌న‌లు జ‌రిగిన స‌మ‌యంలో నాని, వంశీలు.. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఉన్నార‌ని స‌మాచారం. కానీ, వారు ఈ ఘ‌ట‌న‌ల‌పై స్పందించ‌లేదు. కాగా.. గ‌తంలో చంద్ర‌బాబు ఇంటిపైనా.. టీడీపీ కార్యాల‌యంపైనా.. ఆ పార్టీ నేత‌ల‌పైనా వైసీపీ నాయ‌కులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో వారిని క‌ట్ట‌డి చేయాల్సి అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. ‘బీపీ వ‌చ్చి దాడులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. మ‌రి ఇప్పుడు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా.. బీపీ వ‌చ్చి దాడులు చేశార‌ని అనుకోవాలా?! అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.