హైదరాబాద్ డొల్లతనాన్ని చెప్పిన ఆ విషాదం

హైదరాబాద్‌ను విశ్వ నగరంగా పాలకులు తెగ పొగిడేస్తుంటారు. ఇక్కడ జరిగిన, జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఐతే ఎంత అభివృద్ధి సాధిస్తే ఏముంది.. ఒక భారీ వర్షం వస్తే నగరం సగం మునిగిపోతుంది.

రోడ్ల మీద నీటి కుంటలు కనిపిస్తాయి. తాజా వర్షాలకు టోలిచౌకి ప్రాంతం చెరువులా మారిన దృశ్యాలు ఎలా వైరల్ అయ్యాయో తెలిసిందే. ఐతే ఇవన్నీ తాత్కాలిక ఇబ్బందులే అని కొట్టి పడేయడానికి కూడా లేదు.

ఏటా వర్షా కాలంలో కొన్ని ఘోర ప్రమాదాలు చోటు చేసుకుని.. మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. తాజాగా నగరంలోని నేరేడ్‌మెట్‌ దీన్‌దయాళ్‌ కాలనీలో సుమేధా కపూరియా అనే పన్నెండేళ్ల బాలిక హైదరాబాద్ వర్షాల ధాటికి ప్రాణాలు కోల్పోయింది.

మ్యాన్ హోళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఆ పాప ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. ఈ అమ్మాయి శుక్రవారం సాయంత్రం తన సైకిల్ తీసుకుని బయటికి వెళ్లింది. ఆ సమయంలోనే భారీ వర్షం మొదలైంది. కాసేపటికే వీధులన్నీ జలమయం అయ్యాయి. ఆ పాప తన సైకిల్లో ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా.. మ్యాన్ హోల్ తెరిచి ఉన్న సంగతి తెలియక అందులో పడిపోయింది.

ఎంతసేపటికీ తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో సుమేధా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులతో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది, రెస్క్యూ టీం వచ్చి గాలింపు చేపట్టారు. చివరికి సుమేధా ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువులో బాలిక మృత దేహం లభ్యమైంది. పూర్తిగా రంగు తిరిగి విగతజీవురాలిగా మారిన తన కూతుర్ని చూసి ఆ తండ్రి ప్రాణం విలవిలలాడిపోయింది.

తన కూతురు ప్రాణం పోవడానికి ముందు ఆ కొన్ని నిమిషాలు ఎంత విలవిలలాడి ఉంటుందో అంటూ ఆయన మీడియా ముందు కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురి లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డాలని.. నాలాల వద్ద రక్షణ కల్పించారని ఆయన ఏడుస్తూ వేడుకున్నారు. ఇప్పటికైనా నాలాల విషయంలో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టడం, వర్షపు నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు చేపట్టడం అత్యవసరం.