అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడింది ?

కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నది. 2019 లోక్ సభ ఎన్నికలలో యూపీలో 62 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికలలో కేవలం 33 స్థానాలకు పరిమితమయింది. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ 37, కాంగ్రెస్ 6, ఆర్ఎల్డీ 2, ఆజాద్ సమాజ్ పార్టీ 1, అప్నా దళ్ ఒక స్థానం గెలుచుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రామమందిరం నిర్మించిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ ఓటమి దేశవ్యాపితంగా చర్చానీయాంశం అయింది.

ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో 54567 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. అయోధ్య రామమందిరం పేరుతో అనేక రాష్ట్రాలలో విజయం సాధించిన బీజేపీ అక్కడ ఓడిపోవడం గమనార్హం. రామమందిరం నిర్మాణం కోసం సేకరించిన భూములను నష్టపోయిన బాధితులకు సరైన పరిహారం ఇవ్వకపోవడం మొదటి కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా భూములు తీసుకున్న వారి మీద అక్రమ కేసులు పెట్టడం కారణమైంది.

బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ ఎన్నికల ప్రచారంలో ‘అంబేద్కర్ పుట్టిన రోజున రాజ్యాంగాన్ని మారుస్తామని, రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీకి 400 స్థానాలలో గెలిపించాలని’ అన్నారు. ఇది ఇక్కడ ఉన్న 28 శాతం ఓబీసీలకు రుచించలేదన్నది రెండో కారణంగా చెబుతున్నారు. అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ అధిష్ఠానం పక్కకు పెట్టిందని తెలుస్తుంది. రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం తెలిపినప్పటికీ, 62 సిట్టింగ్‌ స్థానాల్లో 55 మందికి అధిష్టానం టికెట్లు ఇవ్వడమూ యూపీలో ఓటమికి కారణం అని చెబుతున్నారు.