ప్రజలు వైసీపీని ఏమార్చారట

151 కాదు అంతకుమించి.. వైనాట్ 175.. ఎన్నికల ముంగిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ధీమా ఇది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఓటమి ఖాయం అని చెప్పినా సరే.. వైసీసీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కౌంటింగ్ రోజు చూస్తారు కదా అని ధీమాగా మాట్లాడారు. ఈ నెల 9న విశాఖపట్నంలో జగన్ రెండోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా పెట్టేశారు.

కట్ చేస్తే.. ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోరమైన పరాభవం చవిచూసింది. మరీ హీనంగా 11 సీట్లకు పరిమితం అయింది. ఫలితాలు చూసి ఎలా స్పందించాలో అర్థం కాని అయోమయంలో పడిపోయారు వైసీసీ నేతలు. జగన్ సైతం.. తాను చేసిన మంచంతా ఏమైపోయిందా.. ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బులు అందుకున్న ప్రజల ఓట్లన్నీ ఏమైపోయాయో అని ఆశ్చర్యపోయారు.

కాగా ఓటమి అనంతరం వైసీపీ మద్దతుదారులు ఒక క్యాంపైనింగ్ మొదలుపెట్టారు. జగన్ జనం చేతిలో మోసపోయాడట. ఇప్పటిదాకా జనాన్ని మోసం చేసిన నాయకులున్నారు కానీ.. తొలిసారి ఒక నాయకుడు జనం చేతిలో మోసపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. నా నాయకుడు ఓడిపోలేదు మోసపోయాడు అనే కొటేషన్‌తోనూ పలువురు వాట్సాప్ స్టేటస్‌లు పెడుతున్న పరిస్థితి.

ఇలా ఉంటే.. వైజాగ్ నార్త్ స్థానం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేకే రాజు ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనం తమ పార్టీని ఏమార్చారని ఆయన వ్యాఖ్యానించారు. తాను పాతికేళ్లుగా రాజకీయాలతో కనెక్ట్ అయి ఉన్నానని.. రాజకీయ విశ్లేషణలు చేయడం, చదవడం తనకెంతో ఇష్టమని.. కానీ ఈసారి ఏపీ ఎన్నికల్లో జరిగింది మాత్రం అంచనాలకు అందనిది అని రాజు చెప్పారు. “ఎన్నికల్లో రకరకాల ప్రభంజనాలు వస్తుంటాయి. కానీ నాకు తెలిసి ఇలా జరగడం మాత్రం తొలిసారి. రాజకీయ నాయకుల దగ్గర వాళ్లకున్న ఇబ్బందిని బయటపడనివ్వకుండా.. ఎవ్వరేం అడిగినా తలూపి ప్రజలు రాజకీయ నాయకులను, పార్టీని ఏమార్చడం.. వాళ్ల మనసులో ఏం అనుకున్నారో అది తు.చ తప్పకుండా చేయడం అనేది మొట్టమొదటిసారి జరిగింది” అని వ్యాఖ్యానించారు రాజు.