ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రాజధానిని ఇతర నగరాలైన విజయవాడ, మంగళగిరి, మచిలీపట్నం, హైదరాబాద్తో కలుపుతాయి. మొత్తం 5 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయమైన ఈ ప్రాజెక్టులను గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
1) స్టీల్ బ్రిడ్జి: అమరావతిలోని కొండవీడు వాగుపై దీనిని నిర్మించారు. సుమారు 0.67 కిలోమీటర్లు ఉంటుంది. ఇది.. అమరావతిని సీడ్ యాక్సిస్ రోడ్డుకు-కొండవీడు వాగుకు అనుసంధానంగా నిర్మించారు. స్టీల్ బ్రిడ్జి కట్టడానికి కారణం.. వరదల సమయంలో వాగు పొంగినప్పటికీ.. నీరు బయటకు రాకుండా.. ఈ స్టీల్ బ్రిడ్జిని ఎత్తుతారు. దీంతో అటు అమరావతికి రక్షణగాను, మరోవైపు సీడ్ యాక్సిస్ రహదారికి అనుసంధానంగా కూడా ఉంటుంది.
2) సీడ్ యాక్సిస్ రహదారి: అమరావతిని పూర్తిస్థాయిలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే ప్రధాన మార్గం. దీనిని ప్రస్తుతం 4 లేన్ల రహదారిగా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో 6 లేన్లకు విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీంతో ఆమేరకు రోడ్డుకు ఇరువైపులా భూమిని కేటాయించి ఉంచారు. ఇది.. పూర్తిస్థాయిలో విజయవాడ, మంగళగిరి, హైదరాబాద్ల నుంచి వచ్చేవారు అమరావతిలోకి ప్రవేశించేందుకు కీలక రహదారిగా ఉపయోగపడుతుంది.
ఒక్క సీడ్ యాక్సిస్ రోడ్డు విషయంలోనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టిపెట్టింది. దీనివల్ల అమరావతిలో ఏ మూల నుంచి ఏమూలకు రావాలన్నా.. ఇబ్బందులు తప్పడంతోపాటు.. అత్యంత సులువుగా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రోడ్డుపైనే మూడు వంతెనలు.. రెండు బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ కాగా.. మరొకటి కృష్ణానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన. ఇలా.. రాజధానిలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు తాజాగా ప్రారంభించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates