బోరుమంటున్న బెట్టింగ్ బంగార్రాజులు !

ఏపీలో టైట్ ఫైట్ ఉంటుంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని నమ్మిన బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఫలితాలు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయి బోరుమంటున్నారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టుపెట్టి మరీ ఎన్నికల ఫలితాలపై పందాలు కాశారు. ఈ సారి ఎన్నికల మీద వందల కోట్ల బెట్టింగులు జరిగాయని చెబుతున్నారు.

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్‌ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవడంతో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన కొందరు చేనేత కార్మికులు కలిసి వైసీపీ గెలుస్తుందని రూ.5 లక్షలు పందెం కాశారు. వైసీపీ ఓటమితో డబ్బులు పోయి వారు బోరుమంటున్నారు.

గుంటూరులో రూ.50 లక్షలు పందె కాసిన ఓ వ్యక్తి ఊరు విడిచి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో హింస ప్రజ్వరిల్లిన పల్నాడులోనూ పందెంరాయుళ్లు ఏం తక్కువ తినలేదు. పల్నాడు జిల్లా రొంపిచర్ల చెరువు కట్ట సెంటర్‌లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకుని టీడీపీ, వైసీపీ అభిమానులు అతని వద్ద సుమారు రూ.1.50 కోట్ల మేర నగదును పెట్టారు. ఫలితాల తర్వాత డబ్బుల కోసం అతని ఇంటికి వెళ్లగా అతను అప్పటికే ఊర్లో నుండి ఉడాయించినట్లు తెలుస్తుంది.

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరులో చంద్రబాబు సీఎం అవుతారని ఓ వైసీపీ నేతతో పందె కాసి రూ.50 లక్షలు అతని వద్ద పెట్టారు. గెలిచిన వారికి డబ్బులు ఇచ్చేలా కాగితం కూడా రాసుకున్నారు. తీరా ఫలితాల తర్వాత వెళితే అతడు ఊరు విడిచి పారిపోయాడు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి తర్వాత ఏపీలో జోరుగా పందాలు కాసినట్లు తెలుస్తుంది.