పవన్ చెంతకు పిఠాపురం పీఠం

ఊహించినట్టే ఇవాళ జరుగుతున్న ఏపీ ఎన్నికల ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోవడం అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేస్తోంది. ఇంకో 14 రౌండ్లు ఉండగానే 20 వేల ఓట్ల ఆధిపత్యంతో అధికార పార్టీ వైసిపి అభ్యర్థి వంగ గీత మీద గెలుపు దిశగా స్వారీ చేయడం అప్పుడే ట్రెండ్ గా మారుతోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచే ఈ ధోరణి కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం మాటల్లో చెప్పేది కాదు. మొత్తం పూర్తయ్యాక ఏపీలోనే అత్యధిక మెజారిటీ పవన్ సొంతమైనా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల మాట.

ఎలాగైనా అధికార పార్టీని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్న పవన్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో ఎదురైన ఓటమికి పూర్తి లెక్కలు సరిచేయలేని గట్టిగా నిర్ణయించుకున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకుని ఆపై బిజెపిని కలుపుకుని కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితం కావాల్సి వచ్చినా తనని తన వ్యూహాన్ని నమ్మమనే పవన్ చెబుతూ వచ్చారు. చివరికి అదే నిజమయ్యింది. ఆరిస్టులు, దర్శకులు, నిర్మాతలు ఎందరు క్యాంపైన్ చేసినా ఎక్కువ పని చేసింది మాత్రం పవన్ మేనియానే. కూటమి అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి పిఠాపురంలోనే నివాసముండటం దానికి ఉదాహరణ.

ఇంకా సాయంత్రం దాకా సమయం ఉంది కాబట్టి అప్పుడే పవన్ గెలుపుని అధికారికంగా చెప్పేయలేం కానీ వాతావరణం గమనిస్తే గెలుపు ఎవరిదో కళ్ళముందు కనిపిస్తోంది. పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టే క్షణం కోసం ఎదురు చూస్తున కార్యకర్తలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ కమిషన్ నుంచి పవన్ గెలిచినట్టు డిక్లరేషన్ వస్తుందాని ఎదురు చూస్తున్నారు. ఇంకొన్ని గంటల్లో ఆ లాంఛనం కూడా పూర్తవుతుంది. ఇంకోవైపు కుప్పం నుంచి చంద్రబాబునాయుడు తిరుగులేని తన ఆధిపత్యాన్ని కొనగిస్తున్నారు. ఇక ఓట్ల పరంగా ఎవరెవరు ఏఏ రికార్డులు బద్దలు కొట్టి సంచలనాలు సృష్టించి వేచి చూడాలి.