ఏపీలో షాకింగ్‌: ఎమ్మెల్సీ పై అన‌ర్హ‌త వేటు

ఏపీలో కీల‌క‌మైన ఓట్ల లెక్కింపున‌కు ముందు.. సంచ‌ల‌న సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన స్థానిక సంస్థ‌ల ఎమ్మె ల్సీ ఇందుకూరి ర‌ఘురాజుపై శాస‌న మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు అన‌ర్హ‌త వేటు వేశారు. ఆయ‌న‌ పై వ‌చ్చిన అభియోగాల‌ను అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన త‌ర్వాత‌.. ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మోషేన్ రాజు తెలిపారు.

ఈ మేర‌కు శాస‌న మండ‌లి సెక్ర‌టేరియెట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం మేర‌కు.. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు తెలిపారు. దీంతో 2021లో మండ‌లికి ఎన్నికైన ర‌ఘురాజుకు స‌భ్య‌త్వం పోయిన‌ట్టు అయింది.

ఏం జ‌రిగింది?

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఇందుకూరి ర‌ఘురాజు ఆది నుంచి వైసీపీలో ఉన్నారు. 2019లో పార్టీ విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలోనే 2021లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. ఈ క్ర‌మంలో కొంద‌రిని ప‌క్క‌న పెట్టి మ‌రీ రాజుకు ఛాన్స్ ఇచ్చార‌ని వైసీపీ నాయ‌కులు అప్ప‌ట్లో అలిగారు. అయితే.. ర‌ఘురాజు.. ఈ ఏడాది మార్చిలో త‌న స‌తీమ‌ణి ఇందుకూరి సుధారాణితో స‌హా 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది సర్పంచుల‌తో స‌హా.. వైసీపీ నుంచి జంప్ చేసి టీడీపీలో చేరిపోయారు.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌మ‌క్షంలో ఇందుకూరి దంప‌తులు ప‌సుపు కండువా క‌ప్పుకొన్నారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురాజుపై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ నాయ‌కుడు, మండ‌లిలో విప్‌గా ఉన్న పాల‌వ‌ల‌స విక్రాంత్ మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజుకు ద‌ర‌ఖాస్తు చేశారు. ప‌లు దఫాలుగా దీనిపై విచార‌ణ చేసిన మోషేన్ రాజు ఓట్ల కౌంటింగ్‌కు ముందు రోజు సోమ‌వారం.. నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఇందుకూరి ర‌ఘురాజును అన‌ర్హుడిగా ప్ర‌క‌టిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలోని పార్టీ ఫిరాయింపుల స‌బ్జెక్ట్ మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వివ‌రించారు.

అదేవిధంగా టీడీపీలో చేరిన త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌హా వైసీపీకి చెందిన ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌పైనా ర‌ఘురాజు తీవ్ర విమ‌ర్శ‌లు చేశార‌ని.. ఇవ‌న్నీ ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లోనూ వ‌చ్చాయ‌ని.. ఈ నేప‌థ్యంలో వాటిని కూడా ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మండ‌లి చైర్మ‌న్ మోషేన్ రాజు పేర్కొన్నారు. అదేవిధంగా వైసీపీ అభ్య‌ర్థిగా ఉంటూ.. టీడీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నార‌ని.. దీనికి త‌గిన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు. ఇలా.. 33 పేజీల‌తో కూడిన ఉత్త‌ర్వుల‌ను మోషేన్ రాజు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.