గీత దాటితే .. తాట తీస్తారు

పోలింగ్ ముగిసిన అనంతరం ఏపీలో చెలరేగిన హింస నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం భద్రతాచర్యలు కట్టుదిట్టం చేశారు. ఏపీవ్యాప్తంగా పెద్దఎత్తున కేంద్ర బలగాల మోహరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు.

ఏపీవ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించి రౌడీషీటర్లను బైండోవర్‌ చేసి కొందరిపై నగర బహిష్కరణ వేటు వేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌ తర్వాత కూడా 20 కంపెనీల బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.

ఏపీ ఎన్నికల కమీషన్ 90వేల మంది భద్రతా బలగాలును మోహరించారు. దాదాపు 60వేల మంది సివిల్‌ పోలీసులు, 20 వేల మంది సిబ్బంది, 8వేల మంది సాయుధ బలగాలను సిద్దం చేశారు. 45వేల 960మంది ఏపీ ‌ పోలీసులతో పాటు 3500మంది కర్నాటక పోలీసులు, 4500మంది తమిళనాడు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

1622మంది హోంగార్డులు, 3366మంది ఇతర పోలీస్‌ సిబ్బంది కౌంటింగ్‌ సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. వీళ్లకు తోడుగా మరో 18,609 మందిని ఈసీ మోహరించింది. ఇందులో 3010మంది ఎన్‌సీసీ, 13వేల739మంది ఎన్‌ఎస్‌ఎస్‌ సిబ్బంది, 1614మంది ఎక్స్‌ సర్వీస్‌మెన్‌, 246మంది రిటైర్డ్‌ పోలీస్‌ సిబ్బంది విధుల్లో ఉంటారు. మద్యం దుకాణాలు, బార్‌ అండ్ రెస్టారెంట్లకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఫలితాల ప్రకటన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలకు ఎన్నికల కమీషన్ అనుమతి నిరాకరించింది.