విప‌క్షాన్ని  ఓ రేంజ్‌లో ఏకేసిన రేవంత్ రెడ్డి!

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని స‌ర్కారు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో 40 నిమిషాల పాటు ప్ర‌సంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. విప‌క్షాన్ని ఓ రేంజ్‌లో ఏకేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స వానికి సోనియా గాంధీని ఆహ్వానించ‌డం నుంచి తెలంగాణ జాతీయ గీతాన్ని ఆవిష్క‌రించ‌డం వ‌ర‌కు వెల్లువెత్తిన అనేక విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న స‌భా వేదిక‌గా స‌మాధానం చెప్పేశారు. ఏ ఒక్క పాయింట్ ను కూడ ఆయ‌న వ‌దిలి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సోనియా ఆహ్వానం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం త‌ర‌ఫున కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురా లు సోనియాగాంధీని ఆహ్వానించారు.. అయితే.. ఇలా ఆమెను ఏహోదాలో ఆహ్వానించారంటూ.. కొంద‌రు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనికి తాజాగా రేవంత్ ఆన్స‌రిచ్చారు. తెలంగాణ‌కు సొనియా త‌ల్లి వంటిద‌ని.. బిడ్డ త‌న ఇంట్లో ఫంక్ష‌న్ చేసుకుంటే.. త‌ల్లిని పిల‌వ‌ద్దా?  అని ప్ర‌శ్నించారు. త‌ల్లిని పిలిచేందుకు అర్హ‌త‌లు.. అనుమ‌తులు కావాలా? అని నిప్పులు చెరిగారు. సోనియా గాంధీకి.. తెలంగాణ‌కు త‌ల్లి పేగు బంధం ఉంద‌న్నారు.

వైభ‌వంగా నిర్వ‌హించ‌డంపై..

తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని.. రేవంత్ స‌ర్కారు వైభ‌వం గా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై బీఆర్ ఎస్ నాయ‌కులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ‌త ప‌దేండ్లుగా తాము కూడా చేస్తున్నామ‌ని.. ఇప్పుడే కొత్తగా చేస్తున్న‌ట్టు రేవంత్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వారు వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్ ఇస్తూ.. “నిజ‌మే ప‌దేండ్లు.. జ‌రిగింది. అది దొర‌పాల‌న‌లో జ‌రిగింది. కానీ, ఇప్పుడు ప్ర‌జా పాల‌న‌లో జ‌రుగుతున్న తొలి ఆవిర్భావ దినోత్స‌వం. అందుకే.. దీనిని వైభ‌వంగా ప్ర‌భుత్వం కాదు.. ప్ర‌జ‌లే నిర్వ‌హించుకుంటున్నారు“ అని వ్యాఖ్యానించారు.

గీతంపై..

తెలంగాణ జాతీయ గీతంపైనా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఏపీకి చెందిన సంగీత ద‌ర్శ‌కుడికి బాధ్య‌త‌లు ఇవ్వ‌డాన్ని కొంద‌రు ప్ర‌శ్నించారు. దీనిపై రేవంత్ స్పందిస్తూ.. “ ప‌దేళ్ల‌యినా.. రాష్ట్రానికి ఒక గీతం రాలేదు. అంద‌కే ఈ బాధ్య‌త‌ల‌ను క‌వి అందెశ్రీకి అప్ప‌గించాం. అంతా ఆయ‌నే చూసుకున్నారు“ అని ముక్త‌స‌రిగా స‌మాధానం చెప్పారు.

తెలంగాణ త‌ల్లిపై..

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంలో మార్పుల‌పైనా.. అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ విగ్ర‌హంలో మార్పులు చేయ‌డం అంటే.. తెలంగాణ ఆత్మ‌ను తీసేయ‌డ‌మ‌ని కొంద‌రు చెప్పారు. దీనిపై స్పందించిన రేవంత్‌.. సగటు గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లిగా ఉండాలని అభిల‌షిస్తున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ తల్లి అంటే కష్టజీవి అని, కరుణామూర్తి అని పేర్కొన్నారు.. అందుకే ఆయా రూపాలు ప్ర‌తిబింబించేలా..  తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవం పోయ‌నున్న‌ట్టు చెప్పుకొచ్చారు.