కండువా కప్పుకోరు.. కానీ పార్టీ మారనున్న తెలుగు తమ్ముడు

అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల మాదిరి వాలే నేతల్ని చేరదీసి..పదువులు ఇచ్చే చంద్రబాబుకు.. తర్వాతి కాలంలో అలాంటి వారిస్తున్న షాకులు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ హయాంలో పదవులు పొందక తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలుగు తమ్ముళ్లు.. ఒక్కొక్కరిగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చూస్తున్నదే. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బ తీయటానికి అధికార పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని పఠిస్తుంటుంది.

అందుకు భిన్నంగా సీఎం జగన్ నుంచి ఎలాంటి ఆహ్వానం లేకున్నా.. ఒక్కొక్కరుగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వదిలేసి.. ఏపీ అధికార పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తునన వైనం తెలిసిందే. ఇప్పటికే ఈ తీరులో పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో టీడీపీ ఎమ్మెల్యే పేరు చేరనుంది. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేశ్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

ఈ రోజు (శుక్రవారం) సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవనున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు అధికార పార్టీకి మద్దతుగా నిలవటం తెలిసిందే. మెడలో పార్టీలో కండువా వేసుకోరు కానీ.. మద్దతు ఇచ్చే సంప్రదాయాన్ని వాసుపల్లి కూడా ఫాలో కానున్నట్లు చెబుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాను అధికారపార్టీలో చేరాలని డిసైడ్ అయిన సంకేతాల్ని ఇచ్చారు. తాజాగా సీఎంను కలిసి.. తాను పార్టీకి మద్దతుదారుగా ఉండనున్నట్లు చెప్పనున్నారు.

సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా.. పార్టీ కండువాను ఆయన కప్పుకోరు. ఇప్పటికే ఇదే తీరును టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ.. కరణం బలరాం .. మద్దాలి గిరిలు ప్రదర్శించారు. తాజాగా వాసుపల్లి కూడా ఇదే రూట్ ను ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తీరు చూస్తే.. ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఎంతమంది మిగులుతారన్నది పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.