వైసీపీకి భారీ షాక్‌.. పోస్ట‌ల్ బ్యాలెట్‌ పై ఈసీదే నిర్ణ‌యం: హైకోర్టు

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఈ నెల 4న వెలువ‌డనున్న ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అత్యంత కీల‌క‌మైన పోస్ట‌ల్ బ్యాలెట్ వ్య‌వ‌హారంలో ఆ పార్టీ వేసిన పిటిష‌న్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పోస్ట‌ల్ బ్యాలెట్ విష‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌య‌మే ఫైన‌ల్ అని తేల్చి చెప్పింది. ఈ విష‌యంలో తాము జోక్యం చేసుకునేది లేద‌ని పేర్కొంది. దీంతో కీల‌క‌మైన ఎన్నిక‌ల ఫ‌లితాల ముందు వైసీపీకి భారీ షాక్ త‌గిలిన‌ట్ట‌యింది.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో 5.6 ల‌క్ష‌ల మంది పోస్ట‌ల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరిలో ఉద్యోగులు 3.6 ల‌క్ష‌ల మంది ఉన్నారు. అయితే.. వీరు వేసిన ఓట్ల విష‌యంలో వివాదం రేగింది. వారు వేసే ఓటు స‌మ‌యంలో బ్యాలెట్ ప‌త్రంపై సంతకం చేస్తే స‌రిపోతుంద‌ని.. సంబంధిత అటెస్టెడ్ సంత‌కం, సీలు లేక‌పోయిన‌ప్ప‌టికీ అవి చెల్లుతాయ‌ని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి ఫాం 13(ఏ)ని ఉటంకించింది. అయితే.. దీనిని వైసీపీ తీవ్రంగా వ్య‌తిరేకించింది. సంత‌కంతోపాటు సంబంధిత రిట‌ర్నింగ్ అదికారి.. లేదా అటెస్టెడ్ అధికారి సంతకం ఉండాల‌ని.. ఇది నిబంధ‌న అని పేర్కొంది.

ఎన్నిక‌ల సంఘం ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తూ.. కీల‌క మార్పులు చేసింద‌ని.. ఇలా చేయ‌డం వ‌ల్ల వైసీపీకి స‌మాన అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని కోర్టుకు వెల్ల‌డించింది. దీనిని విచారించిన హైకోర్టు.. సుదీర్ఘ వాద‌నల అనంత‌రం.. తీర్పును రిజ‌ర్వ్ చేసింది. ముఖ్యంగా ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫున న్యాయ‌వాది పేర్కొన్న విష‌యాల‌ను కోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ఎన్నిక‌ల సంఘం కార్య‌క‌లాపాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాద‌న్న వాద‌న‌ను అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో వైసీపీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను తాజాగా తోసిపుచ్చింది. దీంతో ఎన్నిక‌ల ఫ‌లితం స‌మ‌యంలో అన్ని పోస్ట‌ల్ బ్యాలెట్ల‌ను లెక్కించేందుకు మార్గం సుగ‌మం అయింది.

ఈ మేర‌కు హై కోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ విజయ్, జస్టిస్ కిరణ్మయి తీర్పు వెలువ‌రించారు. పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు కి సంభందించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన మెమో లో కలుగ జేసుకోబోమ‌ని పేర్కొంది. అటువంటి వివాదాలు కేవలం ఎలక్షన్ పిటిషన్ ద్వారా మాత్రమే పరిష్కరించాలని చట్టం చెబుతోందని తెలిపింది. పిటిషనర్ లకు చట్ట రీత్యా ఉన్న ఇతర అవకాశాలు పొందటానికి అవకాశం క‌ల్పిస్తున్నట్టు ధ‌ర్మాసనం వెల్ల‌డించింది.