కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందా ?

దేశవ్యాపితంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హంగామా మొదలయింది. దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఎ అని మెజారిటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తప్పు అని, అశాస్త్రీయం అని ఇండియా కూటమి వర్గాలు వాదిస్తున్నాయి. ఇండియా కూటమి గరిష్టంగా 150 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలు చెబుతుండగా, 295 స్థానాలు గెలుచుకుంటామని అంటున్నాయి.

ఎన్డీఎ కూటమికి సర్వే సంస్థలన్నీ 281 స్థానాల నుండి 401 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశాయి. అయితే అన్నింటిలో ఆసక్తికర పరిణామం ఏమిటంటే ఈసారి కేరళలో బీజేపీ ఖాతా తెరుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కమ్యూనిస్టుల ఖిల్లా అయిన కేరళలో ఈసారి తప్పక ఒకటి నుండి మూడు స్థానాలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు.

కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ ను బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓడిస్తారని ఇండియా టుడే – యాక్సిస్ మే ఇండియా సంస్థ వెల్లడించింది. త్రిస్సూర్ లో నటుడు, బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని టైమ్స్ నౌ వెల్లడించింది. తమిళనాడులో కూడా ఒకటి నుండి మూడు స్థానాలు బీజేపీకి వస్తాయని చెబుతుండడం విశేషం.