చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం:  తెలంగాణ‌లో టీడీపీ బ‌లోపేతం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఏపీలో మ‌రో నాలుగురోజుల్లో ఎన్నికల ఫ‌లితం రానున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌న దృష్టంగా ఏపీపై పెడతార‌ని అనుకున్నారు. కానీ, ఒక‌వైపు ఏపీ బాధ్య‌త‌లు చూస్తేనే.. అక్క‌డ జ‌రిగే పోలింగ్ వ్య‌వ‌హారాన్ని నిశితంగా గ‌మ‌నిస్తూనే.. ఇప్పుడు తెలంగాణ‌పై నా దృష్టి పెట్టారు. తాజాగా తెలంగాణ నాయ‌కుల‌తో చంద్ర‌బాబు.. హైద‌రాబాద్ లోని త‌న నివాసంలో భేటీ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసే అంశంపై వారితో చ‌ర్చించారు.

అంతేకాదు.. మ‌రికొద్ది వారాల్లోనే తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పోటీ చేయాల ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు  కీల‌క నేత ఒక‌రు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా తెలిపారు. అంతేకాదు.. పార్టీని అన్ని కోణాల్లోనూ డెవ‌ల‌ప్ చేసేందుకు.. పూర్వ వైభ‌వం తెచ్చేందుకు కూడా.. చంద్ర‌బాబు కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు. ఈ క్ర‌మంలో పార్టీకి ఏం కావాలి?  ఎక్క‌డెక్క‌డ లోపాలున్నాయ‌నే విష‌యాల‌పైనా ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఖాళీగా ఉండ‌డంతో త్వ‌ర‌లోనే దీనిని భ‌ర్తీ చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చార‌ని చెప్పారు.

సుదీర్ఘంగా మూడు గంట‌ల పాటు జ‌రిగిన స‌మావేశంలో తెలంగాణ‌లో టీడీపీని పుంజుకునేలా చేయ‌డం, పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు రూపొందించ‌డం.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు.. అధ్య‌క్ష బాధ్య‌త‌లు.. పూర్తిస్థాయిలో తెలంగాణ‌లో పార్టీ ప‌ద‌వుల ప్ర‌క్షాళ‌న వంటివాటిపై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. కానీ, గ‌త ఏడాది న‌వంబ‌రు వ‌ర‌కు పార్టీ తెలంగాణ చీఫ్‌గా ఉన్న కాసాని జ్ఞానేశ్వ‌ర్‌.. ఎన్నిక‌ల‌కుముందు బీఆర్ ఎస్‌లో చేరిపోయారు. అప్ప‌ట్లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి టీడీపీ విముఖ‌త వ్య‌క్తం చేసింది. దీంతో ఆయన పార్టీ మారిపోయారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీ కొంత బ‌ల‌హీన ప‌డింది.

ఇదేస‌మ‌యంలో ఇటీవ‌ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు కూడా.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. త‌న‌కు చంద్ర‌బాబు గురువు కాదంటూ.. రేవంత్ రెడ్డి కొంత గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చారు. దీంతో పార్టీ కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు కూడా హ‌ర్ట్ అయ్యారు. ఇదేస‌మ‌యంలో కొంద‌రు నాయ‌కులు పార్టీకి ఇంకా వెన్నుద‌న్నుగానే ఉన్నారు. ఈ క్ర‌మంలో పార్టీని మ‌రింత ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్ర‌క్షాళ‌న చేయ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఉన్న అవ‌కాశాల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.