చంద్ర‌బాబు రిట‌ర్న్ టు ఏపీ.. ఇక‌, వేడే!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు బుధ‌వారం తిరిగి రానున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత(ఈనెల 13) ఆయ‌న కుటుంబంతో స‌హా.. విదేశాల‌కు వెళ్లారు. అయితే.. చంద్ర‌బాబు ఆరోగ్య ప‌రీక్షల కోస‌మ‌ని అప్ప‌ట్లో పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో నారా లోకేష్‌, ఆయ‌న స‌తీమ‌ణి కూడా ఉన్నారు. మొత్తంగా నారా కుటుంబం అమెరికాలో ప‌ర్య‌టించింది. ఈ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని బుధ‌వారం చంద్ర‌బాబు ఫ్యామిలీ తిరిగి రానుంది. బుధ‌వారం ఉదయం 8 గంట‌ల స‌మ‌యానికి హైద‌రాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి చేరుకుంటారు.

అక్క‌డ నుంచి హైద‌రాబాద్ నివాసానికి చేరుకుని.. సాయంత్రం లేదా.. బుద‌వారం రాత్రికి ఏపికి చేరుకోనున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. అధికారిక వ‌ర్గాలు మాత్రం హైద‌రాబాద్‌కు బుద‌వారం ఉద‌యం రానున్న‌చంద్ర‌బాబుకు .. గ‌ట్టి భ‌ద్ర‌త క‌ల్పించాలంటూ.. అటు హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స‌హా.. ఇటు ఏపీ అధికారుల‌కు కూడా స‌మాచారం అందించారు. చంద్ర‌బాబుకు ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ ఈ మేర‌కు అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు. జెడ్ + కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న చంద్ర‌బాబు ఇంటికి చేరుకునే మార్గంలో భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని.. అంబులెన్సు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని సూచించారు.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు రాక‌తో ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్క‌నున్నాయి. మ‌రో వారంలో ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జ‌రుగుతుండ‌డం.. ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్తి చేయ‌డం తెలిసిందే. అయితే. చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌లకు సంబంధించి పోస్ట్ పోల్ స‌ర్వే చేయించార‌ని పార్టీ వ‌ర్గాలు చెప్పాయి. రెండు ప్ర‌ధాన సంస్థ‌ల‌తో ఆయ‌న స‌ర్వే చేయించారు. ఈ ఫ‌లితాలు ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు చేరాయ‌ని.. ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే కీల‌క‌నాయ‌కులు వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో ఆయాఫ‌లితాల‌ను బేస్ చేసుకుని చంద్ర‌బాబు రాజ‌కీయ వేడి పెంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది. జూన్ 1న ఏడోద‌శ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. అదే రోజు సాయంత్రం చంద్ర‌బాబు ఈ ఫ‌లితాల‌ను మీడియాకు స్వ‌యంగా వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు.. విదేశాల‌కు కుటుంబంతో స‌హా వెళ్లిన‌ సీఎం జ‌గ‌న్ .. జూన్ 1నాటికి తిరిగి రానున్నారు.