జూన్ 4 కాదు.. జూన్ 1పైనే ఉత్కంఠ

దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ఇప్ప‌టి వ‌రకు ఆరు ద‌శ‌ల్లో పూర్త‌యింది. మ‌రో ద‌శ పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. అది జూన్ 1న జ‌ర‌గ‌నుంది. ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితాలు.. జూన్ 4న తేలిపోనున్నాయి. ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం గ‌ట్టారు..? ఎవ‌రిని అంద‌లం ఎక్కించారు? ఎవ‌రిని దించేశారు? అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4 పై స‌హ‌జంగానే చ‌ర్చ ఉంది. అయితే.. దీనికి మించి ఇప్పుడు జూన్ 1 కోసం ఎక్కువ మంది వేచి ఉన్నారు. ఎవ‌రిని క‌దిలించినా.. జూన్ 1 ఎప్పుడొస్తుంద‌బ్బా! అనే మాటే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

దీనికి ప్ర‌ధాన కారణం.. ఆ రోజు జ‌ర‌గ‌నున్న ఏడో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ అనుకుంటే పొర‌పాటే. ఆరోజు ఏడో ద‌శ పోలింగ్ జ‌ర‌నుంది. కానీ.. అదే రోజు దేశ‌వ్యాప్తంగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు అంతో ఇంతో తెర‌దించుతూ.. ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి . కేంద్ర ఎన్ని క‌ల సంఘం ఆదేశాలు.. నిబంధ‌న‌ల మేర‌కు.. దేశంలో జ‌రిగిన సార్వ‌త్రి ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను జూన్ 1 సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు వెల్ల‌డించే అవ‌కాశం లేదు. ఇదే ఉత్కంఠ‌కు కార‌ణంగా మారింది. జూన్ 1 సాయంత్రం కోసం అందుకే దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్ర‌ఖ్యాత ఎగ్జిట్ పోల్స్ సంస్థ‌లు ఆరోజు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత‌.. త‌మ ఫ‌లితాలు వెల్ల‌డించేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యాయి.

వీటిలో చాణ‌క్య‌, టైమ్స్ నౌ, న్యూస్ 18, జీ న్యూస్‌, జ‌న్‌మత్‌స‌హా.. ఏపీలో ఆరా మ‌స్తాన్‌, నాగ‌న్న వంటి స‌ర్వే సంస్థ‌లుఉన్నాయి. వీటివి విశ్వ‌సనీయ‌త కూడా ఉన్న నేప‌థ్యంలో ఆ రోజు వ‌ర‌కు ఇవి వేచి ఉంటున్నాయి. దీంతో ఇవి ఏం చెప్ప‌నున్నాయి?  ఎవ‌రికి మొగ్గు చూపించ‌నున్నాయి.. ప్ర‌జ‌ల నాడిని ఎలా ప‌ట్టుకోనున్నాయ‌నే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వీటితో పాటు.. స్థానికంగా వైసీపీ చేయించుకున్న ఐప్యాక్ స‌ర్వే కూడా.. అదే రోజు రానుంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు చేయించుకున్న స‌ర్వే ఫ‌లితాలు కూడా అదే రోజు విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో జూన్ 4 కంటే కూడా..జూన్ 1కి అత్యంత ప్రాధాన్యం పెరిగిపోయింది. అంద‌రి క‌ళ్లూ కేలండ‌ర్‌పైనే ఉండ‌డానికి కార‌ణం ఇదే!!