ఏపీలో కూట‌మిదే అధికారం: అమిత్ షా ధీమా

ఏపీలో ఎన్డీయే కూట‌మి(టీడీపీ+జ‌న‌సేన‌+బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆయ‌న పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీలో కూట‌మి బాగా ప‌నిచేసింద‌ని తెలిపారు. రాష్ట్రం అభివృద్దిలో సాగాలంటే.. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావాల‌ని ప్ర‌జ‌లు బ‌లంగా విశ్వ‌సించార‌ని తెలిపారు. అందుకే రాష్ట్రంలో కూట‌మి వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు తెలిపారు. అదేవిదంగా పార్ల‌మెంటు స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు ద‌క్కించుకుంటామ‌ని తెలిపారు. 25 స్థానాల్లో కూట‌మి 17 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని షా వెల్ల‌డించారు.

అదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్‌లోనూ మెజారిటీ సీట్లుద‌క్కించుకోనున్న‌ట్టు షా తెలిపారు. ఇక్క‌డ 42 స్థానాల్లో 24 నుంచి 30 స్థానాల్లో బీజేపీ అభ్య‌ర్థులు గెల‌వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. ఇక‌, కీల‌క‌మైన ముస్లింల రిజ‌ర్వేష‌న్ అంశం గురించి మాట్లాడుతూ.. క‌ర్ణాట‌క‌, ఏపీల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఓబీసీ కోటా కింద‌.. ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసింద‌ని.. ఇప్పుడు తాము కూడా వాటిని కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. అయితే.. కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దేశ‌వ్యాప్తంగా యూసీసీ(ఉమ్మ‌డి పౌర‌స్మృతి)ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు చెప్పారు. ఈ విష‌యంలో రాజ్యాంగంలోనే పేర్కొన్నార‌ని తెలిపారు.

అదేవిదంగా జ‌మిలి ఎన్నిక‌లపైనా కీల‌క నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్క‌క్క విధంగా ఎన్నిక‌లు జ‌రుగుతుం డడంతో ప్ర‌జ‌ల సమ‌యం.. ధ‌నం కూడా వృదా అవుతున్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిపే విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నారు. దీనిపై ఇప్ప‌ట‌కిఏ మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో క‌మిటీ కూడా రిపోర్టు ఇచ్చింద‌ని తెలిపారు. దీనిని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. అదేవిధంగా పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం ఇప్ప‌టికే అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని.. దీనివ‌ల్ల ఎవ‌రికీ ఎలాంటి హానీ క‌ల‌గ‌లేద‌న్నారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో విప‌క్ష కూట‌మి ఇండియా విఫ‌ల‌మైంద‌ని.. ప్ర‌జ‌లంతా మోడీ వెంటే ఉన్నార‌ని మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.