పిఠాపురంలో ఇలా ఎందుకు జ‌ర‌క్కూడ‌దు?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంపై ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో అంచ‌నాలు వ‌చ్చాయి. ఎవ‌రి వాద‌న వారే వినిపిస్తున్నారు. ఇక్క‌డ ఎవ‌రు మాట్లాడినా.. ఎవ‌రు విశ్లేషించినా.. కాపు ఓటు బ్యాంకు గురించి చ‌ర్చిస్తున్నారు. మంచిదే. 75 వేలుగా ఉన్న కాపుల ఓట్ల‌లో 60 వేలు వ‌రకు. ప‌వ‌న్‌కు ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు. ఇక‌, 68 వేలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే మాత్రం వైసీపీకి అనుకూలంగా తీర్పులు చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు గుండుగుత్త‌గా వైసీపీకి ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు.. విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డే అస‌లు కీల‌క విష‌యం ఉంది. యువ‌త ఓట్ల‌న్నీ .. కులాలు, మ‌తాల‌కు అతీతంగా ప‌వ‌న్ వెంటే ఉన్నాయి. ఈ సారి ఖ‌చ్చితంగా తమ అభిమాన నాయ‌కుడిని అసెంబ్లీకి పంపించాల‌ని వారు నిర్ణ‌యించుకున్నారు. ఈ కోణంలో ఎవ‌రూ ఆలోచ‌న చేయ‌డం లేదు. ఇలా చూసుకుంటే.. అన్ని సామాజిక వ‌ర్గాల కంటే కూడా.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకులో 32 వేల మంది యువ‌త ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అదేవిధంగా మైనారిటీల్లోనూ యువ‌త ఉన్నారు. వీరు కూడా.. పార్టీల‌కు అతీతంగా ప‌వ‌న్‌కు జై కొడుతున్న ఓట‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు వ‌ర్గాలు క‌లిపితే.. 48 వేల ఓట్ల వ‌ర‌కు ఉంటాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుత అంచ‌నాల ప్ర‌కారం.. యువ‌త మొత్తం ప‌వ‌న్ వైపే ఉన్నార‌ని అనుకుంటే.. ఈ ఓటు బ్యాంకు కూడా.. జ‌న‌సేన కు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్తితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పిఠాపురంలో మాత్రం.. ఖ‌చ్చితంగా ఈ ఓటు బ్యాంకు ప‌వ‌న్ వైపే ఉంటుంద‌ని అంచ‌నా.

ఇలాచూసుకుంటే.. కాపులు+యువ‌త క‌లుపుకొంటే… 60+48 వేల‌ను కూడితే.. ల‌క్ష‌కుపైగానే ఓట్టు ఏక‌ప‌క్షం గా ప‌వ‌న్‌కు ప‌డుతున్నాయి. ఇత‌ర సామాజిక వ‌ర్గాల్లోనూ.. 50 వేల మంది ఇటువైపు మొగ్గితే.. ప‌వ‌న్ గెలుపు ఈ సారి ఏక‌ప‌క్షంగా మారినా ఆశ్చ‌ర్యంలేద‌నే టాక్ వినిపిస్తోంది. దీనిని అంచ‌నా వేసుకునే ప‌వ‌న్‌.. త‌న‌కు ల‌క్ష మెజారిటీ ఖాయ‌మ‌ని ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇలా అయితే.. వైసీపీ ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఇచ్చే అవ‌కాశం లేద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి.