కేసీఆర్‌కు ఆహ్వానం.. మార్కులు కొట్టేసిన రేవంత్‌!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం కామ‌నే. అధికారంలో ఉన్న పార్టీపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటాయి. పొద్దున లేచిన‌ప్ప‌టి నుంచి నేత‌ల‌కు ఇదే ప‌ని.

కానీ రాజ‌కీయాల‌ను రాజ‌కీయాలుగానే చూస్తూ ఇత‌ర విష‌యాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీల నాయ‌కుల‌ను గౌర‌వించ‌డం ముఖ్యం. అలా అయితేనే పాలిటిక్స్ క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాయి.

ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో సాగుతున్న‌ట్లే క‌నిపిస్తున్నారు. రాజ‌కీయాల‌ను ఓ ద‌శ వ‌ర‌కే ప‌రిమితం చేస్తూ ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించి ప‌దేళ్లు పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని రేవంత్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ వేడుక‌ల‌ను ధూంధాంగా చేయాల‌ని రేవంత్ ఇప్ప‌టికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ వేడుక‌ల‌ను ప‌రేడ్ గ్రౌండ్‌లో ఘ‌నంగా చేసేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో సోనియా గాంధీని ఘ‌నంగా స‌న్మానించ‌నున్నారు.

ఇప్పుడీ వేడుక‌ల‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌ను ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌నుంది. తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు రేవంత్ ఇప్పుడు ప్ర‌త్యేక ఆహ్వానం పంప‌డం హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన కేసీఆర్‌ను ప్ర‌త్యేకంగా గౌర‌వించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడు ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు, ప్ర‌త్య‌ర్థి పార్టీ అని అనుకోకుండా కేసీఆర్‌ను ఈ వేడుక‌ల‌కు రేవంత్ ఆహ్వానించ‌డం విశేషం. దీంతో రేవంత్ మార్కులు కొట్టేశార‌నే చెప్పాలి.

రాజ‌కీయాల‌ను ఓ ద‌శ వ‌ర‌కే ప‌రిమ‌తం చేసి, ఇలా ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను ప్ర‌త్యేకంగా చూడటంతో రేవంత్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.