అధికారుల్లో రెడ్‌బుక్ హ‌డ‌ల్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొంత‌మంది అధికారులు, పోలీసు ఆఫీస‌ర్ల‌కు రెడ్‌బుక్ భ‌యం ప‌ట్టుకుంద‌నే చ‌ర్చ హాట్‌టాపిక్‌గా మారింది. ఇన్ని రోజులు అధికార వైసీపీ ప్ర‌భుత్వ అండ చూసుకుని టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై రెచ్చిపోయిన ఈ అధికారులు ఇప్పుడు దారికి వ‌చ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మికే గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నే అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోనే కాదు అక్క‌డి అధికార వ‌ర్గాల్లోనూ మార్పు స్ఫ‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని తెలిసింది.

వైసీపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌నే సంకేతాల‌తో ఇప్ప‌టి నుంచే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడితో ట‌చ్‌లోకి వెళ్లేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిసింది. ముఖ్యంగా రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్న వాళ్లు హ‌డ‌లెత్తిపోతున్నార‌ని టాక్‌. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా రెడ్‌బుక్‌ను ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ అండ‌తో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించిన పోలీసులు, ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్ల‌ను ఈ రెడ్‌బుక్‌లో రాసుకున్నాన‌ని లోకేశ్ అప్పుడు చెప్పారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వీళ్ల‌పై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటుమ‌న్నారు.

ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చే సూచ‌న‌లు ఉండ‌టంతో ఆయా అధికారుల్లో భ‌యం మొద‌లైంది. ప్ర‌భుత్వ పెద్ద‌ల ఆదేశాల‌తోనే ఒత్తిడి మేర‌కు అలా చేయాల్సి వచ్చింది కానీ తాము టీడీపీకి వ్య‌తిరేకం కాద‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నాల్లో ఈ అధికారులు ఉన్నార‌ని తెలిసింది. మ‌రోవైపు టీడీపీ విధేయులుగా ఉన్న అధికారులు కూడా కీల‌క పోస్టింగ్‌ల కోసం ఇప్ప‌టినుంచే సంప్ర‌దింపుల‌కు తెర‌లేపిన‌ట్లు స‌మాచారం.