‘మండి’లో ‘కంగు’మంటుందా ? ‘కంగు’తింటుందా ?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో దేశంలో వివిద నియోజకవర్గాలలో నిలబడ్డ ప్రముఖులలో ఎవరు గెలుస్తారు ? అని ఆయా లోక్ సభ నియోజకవర్గాలలో పోటీని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ బీజేపీ తరపున ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుండి హిమాచల్ కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నాడు.

గత రెండు లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ రాజకుటుంబీలకు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ లెక్కన ఈ సారి విజయం విక్రమాదిత్యదే అంటున్నారు. అయితే తొలిసారి బీజేపీ ఈ స్థానం నుండి మహిళను పోటీకి దింపిన నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందా ? అని భావిస్తున్నారు.

బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కులు మహేశ్వర్ సింగ్, మాజీ కేంద్రమంత్రి సుఖ్ రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ కంగనాకు మద్దతుగా నిలబడడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ఎన్నికల కోసం కంగనా నెల రోజుల పాటు రాజకీయాలు చేసేందుకు వచ్చిందని, ఎన్నికలు అయిపోగానే సూట్ కేసు సర్దుకుని బాలీవుడ్ కు వెళ్లిపోతుందని విక్రమాదిత్య తీవ్ర విమర్శలు చేస్తున్నాడు.

విక్రమాదిత్య విమర్శలకు ధీటుగా కంగనా స్పందిస్తుంది. చోటా పప్పు అని విమర్శిస్తూ “2023 లో పెద్ద ఎత్తున వరదలు వస్తే, హిమాచల్ ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే, మండి యూనివర్శిటీ, 250 కోట్ల శివధన్ ప్రాజెక్టులను నిలిపేస్తే” ఏం చేశావని ప్రశ్నించింది. అయితే ఢిల్లీ సరిహద్దులలో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడినప్పుడు కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. రైతు సంఘాలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండిలో కంగనా ‘కంగు’మంటుందా ? ‘ఖంగు’తింటుందా ? అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.