సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి సేద తీరేందుకు విదేశాలకు వెళుతున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం జగన్ మే 18న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. మరోవైపు, వైద్య పరీక్షల కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా మే 18వ తేదీ రాత్రి హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్లారు.

అయితే, జగన్ మాదిరి కాకుండా చంద్రబాబు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లారు. వైద్య పరీక్షలు ముగించుకొని ఐదారు రోజుల్లో చంద్రబాబు, భువనేశ్వరి హైదరాబాద్ చేరుకుంటారు.
మూడు నెలల పాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. వారణాసితోపాటు మహారాష్ట్రలోని పలు పుణ్యక్షేత్రాలను చంద్రబాబు, భువనేశ్వరి సందర్శించారు.

ఇక, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆల్రెడీ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి అమెరికా వెళ్లారు. లోకేష్ కూడా వారం రోజుల తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చే అవకాశముంది.