సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. సీమ అంటేనే.. వైసీపీకి కంచుకోట‌గా ఉన్న నియోజ‌క‌వర్గాలు బోలెడు ఉన్నాయి. గ‌త 2019లోమూడు స్థానాల్లో త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీకూడా.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 52 స్థానాలున్న సీమ‌లో వైసీపీకి 49 చోట్ల విజ‌యం ద‌క్కింది. ఇది ఆ పార్టీ విజ‌యానికి దోహద ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ ఈ సారి మ‌రింత విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న‌ది పార్టీ ల‌క్ష్యం.

అయితే.. ఇప్పుడు మారిన స‌మీక‌ర‌ణ‌లు.. ప్ర‌చారం చూస్తే.. వైసీపీ ఓట్లు హైజాక్ అయ్యాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ గుంజేసుకుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌.. ఎక్కువ‌గా సీమ‌పైనే దృష్టి పెట్టారు. మొత్తం 38 రోజుల ప్ర‌చారంలో 26 రోజుల పాటు ఆమె సీమ‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌తి జిల్లాను టార్గెట్‌గా పెట్టుకుని ప్ర‌చారం చేసుకున్నారు. ముఖ్యంగా వైసీపీకి ప‌ట్టున్న క‌డ‌ప‌, క‌ర్నూలు ప్రాంతాల్లో వెళ్లిన చోట‌కే వెళ్లారు.

గ‌ట్టి ప్ర‌చారం చేశారు ష‌ర్మిల‌. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు బ‌దాబ‌ద‌లైంద‌నేది కొంద‌రు చెబుతున్న మాట‌. దీనిలో కాంగ్రెస్ కు మేలు చేసేంత కాక‌పోయినా.. వైసీపీకి న‌ష్టం వాటిల్లే రీతిలో జ‌రిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌డ‌ప‌లో జ‌రిగిన పోలింగ్ను ప‌రిశీలిస్తే.. గ‌త ఎన్నిక‌ల‌కంటే కూడా.. ఎక్కువ‌గా న‌మోదైంది. 83.77 శాతం పోలింగ్‌న‌మోదైంది. ఇది .. గ‌త ఎన్నిక‌లతో పొలిస్తే.. చాలా ఎక్కువ‌. గ‌త 2019లో 73 శాతం పోలింగ్ జ‌రిగితే.. ఈ సారి ప‌ది శాతం ఎక్కువ‌గా ఉంది.

అంటే.. ఇది జ‌గ‌న్ కంటే కూడా ష‌ర్మిల‌, సునీత‌ల ప్ర‌భావంతోనే ఎక్కువ‌గా జ‌రిగింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ ప్ర‌భావంతోనే వైసీపీకి ప‌డాల్సిన ఓటు బ్యాంకు త‌గ్గుముఖం ప‌ట్టి ఉంటుంద‌ని లెక్క‌లు క‌డుతున్నారు. దీనిని వైసీపీ నాయ‌కులు కూడా.. న‌ర్మ‌గ‌ర్భంగా అంగీక‌రిస్తున్నారు. కొంత సింప‌తీ ఉంటుంది.. అని కీల‌క‌నేత ఒక‌రు వ్యాఖ్యానించారు. చెంగు చాపి అడ‌గ‌డంతోపాటు.. క‌న్నీరు పెట్టుకున్న ఉదంతాల‌ను కూడా ఆయ‌న తెర‌మీదికి తెచ్చారు. ఇది వైసీపీ ఓటు బ్యాంకును హైజాక్ చేసి కాంగ్రెస్‌వైపు మ‌ళ్లించేలా చేసింద‌న‌డంలో కొంత వ‌ర‌కు నిజ‌మేన‌ని చెబుతున్నారు.