కేజ్రీ బెయిల్ లాభమా ? నష్టమా ?

మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్టయిన ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెయిల్ మీద బయటకు రావడం ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నది. ఆప్‌ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాలలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదరవుతాయి అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు.

ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా కేజ్రివాల్ ఈ రోజు లక్నో, 16న జమ్‌షెడ్‌పూర్‌, 17న ముంబైలలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆప్‌ నాలుగుచోట్ల పోటీ చేస్తోంది. కాంగ్రె్స్ మూడు స్థానాలలో పోటీ చేస్తుంది. ఢిల్లీలో ఆరో విడతలో భాగంగా ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ పార్టీలు పంజాబ్ లో విడివిడిగా పోటి చేస్తుండడం గమనార్హం.

గత రెండు లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రివాల్ 50 రోజులు జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆప్ శ్రేణులు ప్రచారంలో ఢీలాపడ్డాయి. కేజ్రివాల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఆయన రాకతో ఆప్ శ్రేణులలో ఉత్సాహం నింపింది. సుదీర్ఘ కాలం నుంచి ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల మధ్య రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పంజాబ్ లో సీఎం భగవంత్‌సింగ్‌ మాన్‌ అన్నీ తానై ప్రచారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి కేజ్రివాల్ ప్రచారానికి రాకపోవడమే మంచిది అని భావిస్తున్నారు. ఖదూర్‌ సాహిబ్‌ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది అమృత్‌ పాల్‌సింగ్‌కు బెయిల్‌ రాకపోవడం, కేజ్రీవాల్‌కు ప్రచారం కోసం బెయిల్‌ దొరకడం ఆప్‌కు ఇబ్బందికరం అని భావిస్తున్నారు.