బీజేపీకి మ్యాజిక్‌ ఫికర్‌ !

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఏడు దశల పోలింగ్ లో నాలుగు దశలు పూర్తయ్యాయి. జూన్ 1తో ఏడో దశ పోలింగ్ ముగియనున్నది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే 400 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని విపరీతంగా చెమటోడుస్తున్న బీజేపీ పార్టీ ఈ సారి అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ దాటే పరిస్థితి లేదన్న వార్తలు కమలనాథులను కలవరపెడుతున్నాయి.

ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లో 2019తో పోలిస్తే, తక్కువ ఓటింగ్‌ రికార్డవ్వడం అధికార బీజేపీని ఆందోళనకు గురిచేస్తున్నది. ఏప్రిల్‌ 19న జరిగిన తొలి దఫా పోలింగ్‌లో గతంతో పోలిస్తే 4 శాతం ఓటింగ్‌ తక్కువగా రికార్డయ్యింది. అదే నెల 26న జరిగిన రెండో దశలోనూ గతంతో పోలిస్తే 3 శాతం ఓటింగ్‌ తక్కువగా నమోదైంది. మూడో దశలో 1.2 శాతం, నాలుగోదశంలో 2.3 శాతం ఓటింగ్ తక్కువగా నమోదయింది. ఈ పరిణామాలు మోడీ గ్రాఫ్ పడిపోయింది అన్న సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో దేశమంతా గొప్పగా చెప్పుకొంటున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ పార్టీ అక్కడ పోటీచేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో ఏ ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేకపోవడం గడిచిన మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. కశ్మీర్‌లో మూడు లోక్‌సభ స్థానాలు ఉండగా, ఆ మూడింటిలోనూ బీజేపీ పోటీలో లేదు. కశ్మీరీ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి, భద్రత హామీలను నెరవేర్చకపోవడం, కశ్మీరీ పండిట్ల హత్యాకాండ వెరసి బీజేపీ గ్రాఫ్‌ అక్కడ దారుణంగా పడిపోయింది. అక్కడ ఓటమి తప్పదన్న ఉద్దేశంతోనే అక్కడ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకొన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు కనీస స్థానాలు 272 కావాలి. ఈసారి అధికారాన్ని చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ ఎన్డీయేకు రాబోదని, ఆ కూటమికి 268 సీట్లు కూడా దాటబోవని ప్రముఖ సెఫాలజిస్ట్‌ యోగేంద్ర యాదవ్‌ అంటుండగా, ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటబోవని సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చెబుతున్నారు.