‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్ కోనసీమలో పర్యటించారు. రాజోలు నియోజకవర్గం, శంకరగుప్తం డ్రెయిన్ బాధిత కొబ్బరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. 45 రోజుల్లో సమస్యల శాశ్వత పరిష్కార మార్గాల అన్వేషిస్తానని, సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ ఉంటుందని ఆయన వెల్లడించారు. కోనసీమ కొబ్బరి రైతుకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన పవన్ కళ్యాణ్.. తెలంగాణ నేతలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ నాయకుల దిష్టి కొబ్బరి చెట్లకు తగిలింది అనే ఉద్దేశంలో మాట్లాడినట్లుగా కొంత చర్చ నడిచింది. 

దీనిపై తెలంగాణకు చెందిన నాయకులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రిగా చెబుతున్నా.. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఎక్కడా నీ సినిమా ఆడదు… అంటూ మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇవ్వడం వివాదం కొండా ముదిరింది. వీరికి తోడు ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పేరుని నాని కూడా ఈ అంశంపై మాట్లాడారు. 

అయితే పవన్ కళ్యాణ్… ‘తెలంగాణ నాయకులు గోదావరి పచ్చదనంతో బాగుంటుంది అంటారు. కానీ ఇవాళ కొబ్బరి చెట్లకు మొదళ్ళు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి..’ అని మాత్రమే అన్నారని, దీనిని తెలంగాణ నాయకులు అపార్థం చేసుకున్నారని జనసేన భావిస్తుంది. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు అని జనసేన పేర్కొంది.