భారీ వ‌ర్షంలోనూ చంద్ర‌బాబు ప్ర‌చారం!

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. అయితే.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టేస‌రికి.. భారీ ఎత్తున వ‌ర్షం ప్రారంభ‌మైంది. అయితే.. వ‌ర్షానికి వెర‌వ‌కుండానే ఆయ‌న ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా వ‌ర్షానికి-కూట‌మి పార్టీల‌కు ముడిపెట్టి ఆయ‌న ప్ర‌సంగించ‌డం గ‌మ‌నార్హం. “వ‌రుణుడు చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇది కూట‌మి విజ‌యానికి సంకేతం. మాకు తిరుగు లేదు. మీకు ఎదురు లేదు. కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించండి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

పోలింగ్ ప్ర‌క్రియ కేవ‌లం టెక్నిక‌ల్ మాత్ర‌మేన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే కూట‌మి అభ్య‌ర్థుల గెలుపు ఖ‌రారైంద‌ని చెప్పారు. గ‌న్న‌వ‌రం నుంచి కాబోయే ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావేన‌ని మ‌రో రెండు రోజుల్లో ‘కాబోయే’ అనే మాట కూడా వినిపించ‌ద‌ని చెప్పారు. ఇక‌, మ‌చిలీప‌ట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బాల‌శౌరి ఈ సారి రెండు ల‌క్ష‌ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకోవడం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. కూట‌మి ప‌క్షానే ప్ర‌జ‌లు నిల‌బ‌డ్డార‌ని, దీనికి వ‌రుణుడే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌ని తెలిపారు. ఇది శుభ సంకేత‌మ‌ని చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

మే నెలలో గన్నవరంలో వర్షం పడుతోందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడని, కూట‌మిని త‌న‌దైన శైలిలో ఆశీర్వ‌దించా డ‌ని చంద్ర‌బాబు చెప్పారు. “అనుమానమే లేదు… విజయం మనదే” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంస పాల‌న అంతం అవుతుంద‌ని, మ‌రో రెండు రోజుల్లోనే పోలింగ్ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంద‌ని.. రెండు ఓట్లూ కూట‌మికే వేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా గ‌న్న‌వరం ప్ర‌స్తుత ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. పిల్ల సైకోగా అభివ‌ర్ణించారు.

“తాడేప‌ల్లిలో ఒక సైకో ఉన్నాడు. గ‌న్న‌వ‌రంలో పిల్ల సైకో ఉన్నాడు. ఇక్క‌డ పిల్ల సైకో తిన్నింటి వాసాలే లెక్క‌బెట్టాడు. వీళ్ల‌ని త‌ర‌మి కొట్టే అవ‌కాశం మే 13న మీకు వ‌చ్చింది. వ‌దులుకోవ‌ద్దు. ఇప్పటివరకు నా మర్యాద, మంచిత‌నాన్నే చూశారు. భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేయకపోతే చూడండి” అని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. కాగా,శుక్ర‌వారం చంద్ర‌బాబు ఐదు స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార వేగాన్ని మ‌రింత పెంచారు. మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.