ప‌వ‌న్‌తో పొత్తుకు జ‌గ‌న్ ఆరాటం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌రం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జ‌రిగే పోలింగ్‌తో పార్టీల రాజ‌కీయ జీవితాలు ముడిప‌డి ఉన్నాయి. అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. కుటుంబ విష‌యాల‌నూ ప్ర‌స్తావిస్తూ విమ‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై హ‌ద్దు మీరి మ‌రీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడు ప‌వ‌న్‌పై ఇన్ని మాట‌లంటున్న జ‌గ‌న్‌.. ఒక‌ప్పుడు ఆయ‌న‌తో పొత్తు కోసం ప్రయ‌త్నించారు. 2019 ఎన్నిక‌లకు ముందు జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్దామ‌ని అనుకున్నారు. కానీ అందుకు ప‌వ‌న్ ఒప్పుకోలేదు. ఈ విష‌యాన్ని తాజాగా ప‌వ‌న్ బ‌య‌ట‌పెట్టారు. ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ మాట్లాడుతూ ఈ విష‌యాలు వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌తో పొత్తు కోసం వైసీపీ నేత‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని ప‌వ‌న్ చెప్పారు. పొత్తు కుదుర్చేందుకు చాలా మంది మ‌ధ్య‌వ‌ర్తులు ప్ర‌య‌త్నించార‌న్నారు. కానీ తాను ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించాన‌ని తెలిపారు. వైసీపీతో పొత్తుకు స‌సేమీరా అన్న‌ట్లు పేర్కొన్నారు.

అంతే కాకుండా ఈ ఎన్నిక‌ల నేప‌థ్యంలోనూ ప‌వ‌న్‌తో పొత్తు కోసం జ‌గ‌న్ ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిసింది. ఈ ఎన్నిక‌ల‌కు ముందు కూడా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు జ‌రిగాయ‌ని, కానీ తానే దేనికీ స్పందించ‌లేద‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్‌తో పొత్తుకు జ‌గ‌న్ ఎంత‌లా ఆరాట‌ప‌డ్డారో అనేది అర్థ‌మ‌వుతోంది. అధికారంలోకి రావ‌డం కోసం ప‌వ‌న్‌తో క‌లిసి న‌డవాల‌ని జ‌గ‌న్ ఆశ‌ప‌డ్డ‌ట్లు తెలిసింది. కానీ కుద‌ర‌లేదు. 2019లో ఒంట‌రిగానే పోటీ చేసిన జ‌గ‌న్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. కానీ ఈ సారి మాత్రం వైసీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌నే అంచ‌నాలున్నాయి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిదే విజ‌య‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.