త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

“నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు అంటున్నారు. ఇంత ఘోరంగా నేను ఎవ‌రితోనూ అనిపించుకోలేదు. నాకు కూడా ఒక రోజు వ‌స్తుంది. అప్పుడు అక్క‌లే నాకు క్ష‌మాప‌ణ‌లు చెబుతారు” అని క‌డ‌ప ఎంపీ, వైసీపీ అభ్య‌ర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న క‌డ‌ప‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌చార వాహ‌నంపై నుంచి మాట్లాడుతూ.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వైఎస్ ష‌ర్మిల‌, సునీత ల గురించి కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

త‌న‌పై సొంత అక్క‌లే త‌ప్పుడు ఆరోప‌ణలు చేస్తున్నార‌ని అవినాష్ రెడ్డి వాపోయారు. సునీత‌, ష‌ర్మిల‌లు వాస్త‌వాలు తెలుసుకుని.. త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పే రోజు కోసంఎదురు చూస్తున్నాన‌ని.. ఆ రోజు ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని అవినాష్‌ వ్యాఖ్యానించారు. “ష‌ర్మిల‌క్క‌.. సునీతక్క‌.. నాపై అన‌రాని మాట‌లు అంటున్నారు. నిజానికి వేరేవాళ్ల‌కైతే కోపం వ‌స్తుంది. కానీ, నాకు బాధ క‌లుగుతోంది. ఎందుకంటే వారు చేస్తున్న వ్యాఖ్య‌ల్లో నిజం లేదు. నాకు ఏ పాపం తెలియ‌దు” అని అవినాష్ రెడ్డివ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మేనేజ్ చేస్తున్నార‌ని.. ఆయ‌న ఆపార్టీకి సీఈవోగా వ్య‌వ‌హ‌రి స్తున్నార‌ని అవినాష్ రెడ్డి అన్నారు. అందుకే.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు కాంగ్రెస్ ఆడుతోంద‌ని.. కాంగ్రెస్ చెప్పిన‌ట్టు ష‌ర్మిల‌, సునీత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు రాసిచ్చిన స్క్రిప్టుల‌నే వారు చ‌దువుతున్నార‌ని అవినాష్ విమ‌ర్శించారు. 2021 వ‌ర‌కు మాట్లాడ‌ని వారు ఇప్పుడు ఎందుకు ఎన్నిక‌ల ముందు త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తప్పుడు ప్రచారంతో తనను జైలుకు పంపించాల‌ని చూస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.