బీజేపీకి దక్షిణం ‘దారి’ చూపుతుందా ?

400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఇంతవరకు ఖాతానే తెరవలేదు. ఇక కర్ణాటకలో పోయినసారి 28 లోక్ సభ స్థానాలకు గాను 25 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. తెలంగాణలో 17 స్థానాలకు 4 స్థానాలలో విజయం సాధించింది.

దక్షిణాదిన ఉన్న 130 స్థానాలలో 29 స్థానాలలోనే బీజేపీ విజయం సాధించింది. అంటే 101 స్థానాలలో గెలుపుకు దూరంగానే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి పరిస్థితి ఏంటి ? ఉత్తరాదిన గతంలో ఉన్న ఆదరణ ఉండదని తొలి, మలి దశ ఎన్నికల పోలింగ్ గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో దక్షిణాది ఈ సారి బీజేపీకీ కేంద్రంలో అధికారానికి దారి చూపుతుందా ? అంటే ఫలితాలు వస్తేనే గాని ఏమీ చెప్పలేదని పరిస్థితి.

దక్షిణాది మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన మోడీ పదే పదే ఇక్కడ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పర్యటించాడు. దక్షిణాదిన ప్రధాని మోదీ ఇప్పటివరకు 146 సార్లు పర్యటించాడు. అందులో 64 అధికారిక కార్యక్రమాలు కాగా, 56 పర్యటనలు పార్టీ తరపున నిర్వహించినవి. అంటే ఇక్కడ పాగా కోసం ఎంతలా శ్రమిస్తున్నారో అర్ధమవుతుంది.

ఈసారి తమిళనాడులో మెజార్టీ ఎంపీ సీట్లు దక్కించుకోవడం వీలుకాకుంటే ఓటు షేర్ పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నది. 2014 మే 26 నుంచి 2024 ఏప్రిల్‌ 17వరకు తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడులలో మోదీ 146 సార్లు పర్యటించారు. తన రెండు విడతల పదవీకాలంలో 73 సార్ల చొప్పున ఈ 5 రాష్ట్రాల్లో తిరిగారు. ప్రధాని కార్యాలయంలోని రికార్డుల ప్రకారం.. గత మూడేళ్లలోనే దక్షిణాది రాష్ట్రాల్లో 59 పర్యటనలు జరపడం గమనార్హం.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని బీజేపీ అంచనా వేస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి 0.97%, కేరళలో 12%, తమిళనాడులో 3.6శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి ఏపీలోె పొత్తులో భాగంగా 6 స్థానాలలో బీజేపీ పోటీ చేస్తున్నది. తెలంగాణలో ఈ సారి పది సీట్లు లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులూ ఒడ్డుతున్నది. అయితే పోయినసారి కర్ణాటకలో 25 స్థానాలు గెలవగా, ఈ సారి అక్కడ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం, అతడు విదేశాలకు పారిపోవడం బీజేపీ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. మరి ఈ సారి దక్షిణాది బీజేపీకి ఎంతవరకు సాయపడుతుందో వేచిచూడాలి.