బీజేపీని తిట్టాడని బీఎస్పీ నుండి గెంటేసింది !

బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి హయాంలో తన ప్రాభవం కోల్పోతూ వస్తున్నది. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బీఎస్పీ తరపున 19 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టారన్న విమర్శలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో బీజేపీని విమర్శించాడని తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి, తన రాజకీయ వారసత్వ పదవి నుండి పక్కన పెడుతున్నానని, అతడు సంపూర్ణ పరిపక్వత చెందే వరకు ఇది కొనసాగుతుందని మాయావతి స్పష్టం చేసింది. ఆకాశ్ ఆనంద్ తండ్రి ఆనంద్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తాడని వెల్లడించింది.

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌పై వేటు వేశారు. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్త పదవి నుంచి దూరంగా పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఎక్స్ వేదికగా వెల్లడించారు. 29 ఏళ్ల ఆకాశ్ ఆనంద్ సంపూర్ణ పరిపక్వత చెందే వరకు అతడిని బాధ్యతలకు దూరం పెడుతున్నట్టుగా ఆమె స్పష్టం చేశారు. గత ఏడాది డిసెంబరులో ఆకాష్ ఆనంద్ ను తన రాజకీయ వారసుడిగా మాయావతి ప్రకటించింది.

“ఈ ప్రభుత్వం బుల్‌డోజర్‌ ప్రభుత్వం. దేశద్రోహుల ప్రభుత్వం. యువతను ఆకలితో వదిలి పెట్టి వృద్ధులను బానిసలుగా మార్చుకున్న ఉగ్రవాద ప్రభుత్వం” అని ఆకాశ్ ఆనంద్ ఇటీవల బీజేపీ యూపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో ఎన్నికల నియమావళి ఉల్లంఘించాడని కేసు నమోదయ్యింది.

2019లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆకాశ్ ఆనంద్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన ఐదు నెలల్లోనే మాయావతి వేటు వేయడం బీజేపీ వత్తిడి మూలంగానే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏకంగా మేనల్లుడినే పక్కన పెట్టడం యూపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.