పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది: చంద్ర‌బాబు మాస్ వార్నింగ్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయ‌న బ‌రిలో ఉన్న చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో తాజాగా నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ ప్ర‌జాగ‌ళంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. “పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది. ఇక్క‌డ బుల్లెట్ లాంటి నాయ‌కుడు,.. చ‌ల్లా రామ‌చంద్రారెడ్డిని బ‌రిలో నిలిపాం. పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు మన చల్లా బాబు. ఈయ‌న‌కు ఓట్లేసి గెలిపించాలి” అని చంద్ర‌బాబు స్థానికుల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. సుమారు 15 ఏళ్లుగా పెద్దిరెడ్డి క‌బంద హ‌స్తాల్లో.. పుంగ‌నూరు ప్ర‌జ‌లు అల్లాడుతున్నార‌ని అన్నారు.

పెద్దిరెడ్డి కుటుంబం అరాచ‌కాల‌ను అరిక‌ట్టేందుకు ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు పోటెత్తాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. మైనింగ్‌, శాండ్‌, గ్రావెల్‌, మ‌ద్యం ఏది చూసినా.. పెద్దిరెడ్డి అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయ‌ని.. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. పెద్దిరెడ్డి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపించి.. ఇలాంటి వారిని జైలుకు పంపిస్తామ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “అంగ‌ళ్లు ఘ‌ట‌న‌ను(ఇక్క‌డ గ‌త ఏడాది చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన‌ప్పుడు.. ఆయ‌న‌పై రాళ్ల‌దాడికి ప్ర‌య‌త్నించారు) నేను క‌ల‌లో కూడా మ‌రిచిపోను. అంద‌రికీ బుద్ధి చెబుతా.. ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు. ముల్లును ముల్లుతోనే తీస్తా.. పెద్దిరెడ్డికి బుల్లెట్ దిగుద్ది” అని మాస్ వార్నింగ్ ఇచ్చారు.

“పెద్ది రెడ్డి మామూలోడు కాదు. పాపాల పెద్దిరెడ్డి. ఆయ‌న చేసిన పాపాలు రాస్తే.. ఆక్స‌ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీ కూడా స‌రిపోదు. తండ్రి ఎమ్మెల్యే, మంత్రి, కొడుకు ఎంపీ, త‌మ్ముడు ఎమ్మెల్యే.. అయితే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు మేము మీకు బానిస‌లుగా ఉండాలా? నీ కొవ్వు క‌రిగిస్తాం.. ఈ పొగ‌రు తీర్చేస్తాం. ప్ర‌జ‌లు దీనికి సిద్ధంగా ఉండాలి. టీడీపీ అన్ని విధాలా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటుంది. ప్ర‌జా ప్ర‌బుత్వం రాబోతోంది. ఒక్కొక్క‌రి సంగ‌తి జూన్ 5వ తేదీ నుంచి ఎలా మారుతుందో చూపిస్తాం. రెడీగా ఉండాలి” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. పెద్దిరెడ్డి ఆధిప‌త్యాన్ని అణిచేసేందుకు ఎంపీగా న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా పోటీలో ఉన్నార‌ని.. ఆయ‌న పొగ‌రును కూట‌మి ప్ర‌భుత్వం అణిచేస్తుంద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.