పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేసే నియోజకవర్గం ఎంపికలో ఎంతో కసరత్తు చేశాకే పిఠాపురంను ఎంచుకున్నారు పవన్.

కానీ ఇక్కడ పవన్ గెలవగలడా అనే విషయమై మొదట్లో కొంత సందేహాలు నెలకొన్నాయి. అక్కడ టీడీపీ తరఫున క్యాండిడేట్‌గా ఆశలు పెట్టుకున్న వర్మకు బాగానే బలం ఉండడం.. టికెట్ దక్కకపోవడంతో ఆయన రెబల్‌గా మారి పోటీ చేసి పవన్‌ను దెబ్బ తీయొచ్చన్న అంచనాలతో గందరగోళం నెలకొంది.

మరోవైపు వంగా గీత లాంటి బలమైన క్యాండిడేట్‌ను బరిలో నిలపడమే కాక.. ముద్రగడ పద్మనాభం, మిథున్ రెడ్డి సహా వైసీీప పరివారాన్ని పెద్ద సంఖ్యలోనే మోహరించి పవన్‌ను ఎలాగైనా ఓడించాలని వ్యూహం రచించారు జగన్.

కానీ రోజులు గడిచేకొద్దీ పవన్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయి ఆయనకు అంతకంతకూ మద్దతు పెరిగిపోగా.. వైసీపీ వ్యూహాలేవీ పెద్దగా పని చేయని పరిస్థితి నెలకొందన్నది క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న సమచారం. వర్మ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనను మానుకుని పవన్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన వెంటే ఉండి ప్రచారంలో పాల్గొన్నారు.

రోజులు గడిచేకొద్దీ టీడీపీ, జనసేన మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లున్న కాపులు పూర్తిగా పవన్ వైపు నిలబడుతున్నారని అంటున్నారు. పవన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పట్టుదలతో ఆ వర్గం కనిపిస్తోంది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. ఇలా మెగా ఫ్యామిలీలో పలువురు.. హైపర్ ఆది లాంటి కమెడియన్లు పవన్ కోసం చేసిన ప్రచారం బాగానే పని చేసింది.

తాజాగా చిరు కూడా పవన్‌ను గెలిపించాలని పిఠాపురం ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో పవన్‌కు నియోజకవర్గంలో మంచి ఊపు కనిపిస్తోందిజ ఇంకోవైపు ముద్రగడ లాంటి బలమైన కాపు నేత పవన్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రచారం, వ్యాఖ్యలు పెద్దగా ఫలితాన్నివ్వట్లేదని చెబుతున్నారు. పవన్ మీద అకారణంగా విషం చిమ్ముతున్నారన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.

పవన్ చరిష్మా ముందు వంగా గీత నిలబడలేకపోతున్నారని.. జనాలకు పంచేందుకు దాచి పెట్టిన భారీ నగదును పోలీసులు పట్టుకుని.. పంపకాలు జరగకుండా ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తుండడం కూడా ప్రతికూలంగా మారిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ నియోజకవర్గంలో పవన్ జస్ట్ గెలవడం కాదు, భారీ మెజారిటీ సంపాదిస్తారన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట.