ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే నిర్దేశించే స్థాయికి వెళ్లిపోతుంటాయి. ప్రతిపక్షాలు అలాంటి అంశాలను సరిగ్గా అందిపుచ్చుకుని అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం చూస్తుంటాం. గత ఎన్నికల ముంగిట ప్రత్యేక హోదా అంశంతో టీడీపీని ప్రతిపక్ష వైసీపీ అలాగే ఇరుకున పెట్టి ప్రయోజనం పొందింది. కానీ ఎన్నికల తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టేసిందన్నది వేరే విషయం.

ఇక వర్తమానంలోకి వస్తే.. వైసీీపీని ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష టీడీపీ, జనసేన తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈసారి ఇది ఎన్నికల అంశంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. కేవలం వారం రోజుల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారి వైసీపీని ముంచేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇటు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సహా ఇరు పార్టీల ముఖ్య నేతలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో ఎన్నికల ప్రచార సభల్లో బలంగా చెబుతున్నారు. దీనికి తోడు వైసీపీ వ్యతిరేక మీడియా కూడా ఈ అంశాన్ని నెత్తికెత్తుకుని వరుస కథనాలు సంధిస్తున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో దీని మీద వార్తలు హోరెత్తిపోతున్నాయి.

ఇక సోషల్ మీడియా ప్రచారం గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఆ కథనాలు, పోస్టులు చదివితే ఎవరికైనా గుబులు రేగడం ఖాయం. అసలే ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కబ్జాలు, భూ వివాదాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే భూములకు అసలు రక్షణ లేకుండా పోతుందనే భయాన్ని జనాల్లో పుట్టించడంలో ప్రతిపక్షాలు, మీడియా విజయవంతం అవుతున్నాయి.

ఇప్పటికే పాస్ బుక్‌ల మీద జగన్ ఫొటోలు ముద్రించడం మీద కూడా వివాదం నడుస్తోంది. ఆ విషయమై సామాన్యుల్లోనూ వ్యతిరేకత నెలకొంది. దాన్ని ఉదాహరణగా చూపించి.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే పూర్తిగా భూముల మీద ఆశలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ప్రతిపక్షాలు, మీడియా కంగారెత్తించేస్తున్నాయి.

ఈ యాక్ట్ విషయంలో వైసీపీ తమ వాదనను బలంగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోతోంది. సీఎం జగన్ సైతం ఈ విషయంలో తడబడుతున్నారు. ఓవైపు ఆయన ఈ చట్టం చాలా మంచిదని చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్లు ఈ చట్టం అమలు చేయబోవట్లేదని ప్రకటించడం గమనార్హం. అంతే కాక కేంద్రమే ఈ చట్టాన్ని ప్రతిపాదించిందని వైసీపీ వాళ్లు చెబుతుండగా.. కేంద్రం ఇచ్చిన మార్గ దర్శకాలకు ఏవేవో మెలికలు పెట్టి ప్రమాదకర రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించిందని ప్రతిపక్షాలు తిప్పి కొడుతున్నాయి. మొత్తానికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ సర్కారు మెడకు బాగానే చుట్టుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.