సురేష్ రైనా కుటుంబ విషాదం.. మిస్ట‌రీ వీడింది

ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై.. ఐపీఎల్‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ఉన్న‌ట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం ప‌ట్టాడు స్టార్ క్రికెట‌ర్ సురేష్ రైనా. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే స్వ‌దేశానికి వ‌చ్చేస్తున్న‌ట్లు అత‌ను ప్ర‌క‌టించాడు. ఆ కార‌ణాలేంటన్న‌ది ఆరా తీస్తే అత‌డి మేన‌త్త ఆశాదేవి కుటుంబంలో నెల‌కొన్న విషాదం వ‌ల్లే అత‌ను ఇంటిముఖం ప‌ట్టాడ‌ని తేలింది.దోపిడీ దొంగ‌ల దాడిలో ఆశాదేవి భ‌ర్త అశోక్ కుమార్, మ‌రో వ్య‌క్తి మృతి చెంద‌గా.. ఆశాదేవి విష‌మ స్థితికి చేరింది. ఈ విషాదానికి సంబంధించిన మిస్ట‌రీ ఇప్పుడు వీడింది.

హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు.ఈ ప‌రిణామంపై స్పందించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌సింగ్‌ కేసును పరిష్కరించినట్లు ప్రకటించారు. పంజాబ్‌ డీజీపీ దిన్‌కర్‌ గుప్తా మాట్లాడుతూ.. రైనా మేన‌త్త కుటుంబంలో జ‌రిగిన దారుణానికి ఒడిగ‌ట్టింది దోపిడీ దొంగ‌లే అని తేల్చారు. 11 మంది సభ్యులతో కూడిన అంతర్‌రాష్ట్ర ముఠా పంజాబ్‌, జమ్మూ కశ్మీర్‌, ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి పలు ఘటనలకు పాల్పడినట్లు వెల్ల‌డించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కొంత బంగారం, హత్యలకు వాడిన కర్రలు, కొంత న‌గ‌దు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఆగ‌స్టు 19న మూడు గ్రూపులుగా విడిపోయిన దొంగలు సురేష్‌ రైనా మేన‌త్త ఆశాదేవి‌ ఇంట్లోకి ప్రవేశించేముందే వారి సమీపంలోని మరో రెండు ఇళ్లల్లో చోరీకియత్నించి విఫలమయ్యారు. అనంతరం నిచ్చెన సాయంతో ఆశాదేవి ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురి తలపై కర్రలతో దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం ఇంట్లోని మరో ఇద్దరిపై దాడిచేసి పారిపోయారు. ఈ దాడిలో ‌రైనా మామ అశోక్‌కుమార్‌, బావమరిది కౌషల్‌ కుమార్‌ మృతిచెందగా.. రైనా అత్త పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రిలో కోలుకున్నారు.