చంద్ర‌బాబు.. న‌న్ను చంపేస్తానంటున్నాడు: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా 45 ఏళ్ల అనుభ‌వం ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనే కావ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా.. చంద్ర‌బాబు క్రిమిన‌ల్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నార‌ని అన్నారు. ఆయ‌న‌ను నేర‌స్తుడిగా పేర్కొన్నారు. త‌న‌ను చంపేస్తాన‌ని చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు జ‌గ‌న్ ఆరోపించారు. అయితే.. త‌నను చంద్ర‌బాబు చంపేస్తానంటే.. ప్ర‌జ‌లు ఊరుకోర‌ని.. ప్ర‌జ‌లే త‌న‌ను ర‌క్షించుకుంటార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ‘మేం సిద్ధం’ యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది. ఈ యాత్ర‌లో పాల్గొన్న సీఎం జ‌గ‌న్‌.. స‌భ‌లో మాట్లాడుతూ.. “నా తండ్రి వైఎస్ గాల్లోనే కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటలను నేను మర్చిపోను. నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక బాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబా బు చేస్తున్న వ్యాఖ్యలు ఆయ‌న‌ నేరప్రవృత్తికి నిదర్శనం” అని అన్నారు.

అంతేకాదు.. “జగన్‌ను చంపేస్తే తప్పేంటి అని చంద్రబాబు అంటున్నాడంటే.. ఆయ‌న న‌న్ను చంపేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టే. అయితే.. చంద్రబాబు అనుకుంటే జగన్‌ చనిపోడు. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై అందరూ ఆలోచన చేయాలి” అని సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉందో ఆలోచన చేయాల‌న్నారు. వెన్ను పోట్లు పొడవడం, మనుషుల్ని చంపేయడమే చంద్రబాబు రాజకీయమ‌ని నిప్పులు చెరిగారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. “ఎన్టీఆర్‌ను, వంగవీటి మోహనరంగాను కుట్రలతో చంపిందెవరు?  ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతో చంపిందెవరు?” అని నిల‌దీశారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు ఎవరైనా నమ్మగలరా? అని ప్ర‌శ్నించారు. మ‌రో 13 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందన్న జ‌గ‌న్‌.. వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయ‌ని.. బాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయ‌ని చెప్పారు. కాగా.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు.. మండిప‌డుతున్నారు. మ‌రోసారి ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యాయి.