గుడ్డు-మ‌ట్టి.. మోడీపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్!

మాట‌ల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. త‌మ వ్యం గ్యాస్త్రాలు, మాట‌ల తూటాల‌తో మోడీని ఏకి ప‌డేశారు. “తెలంగాణ‌కు గాడిద గుడ్డు.- ఏపీకి మ‌ట్టి ఇచ్చాడు” అంటూ.. తీవ్ర‌స్థా యిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. నెత్తిమీద మ‌ట్టితో నింపిన ఓ బాక్సును, దానిపై పెద్ద గుడ్డును పెట్టుకుని ప్ర‌చారంలో ప్ర‌ద‌ర్శించారు. ఈప‌రిణామంతో బీజేపీ శ్రేణులు ఉలిక్కిప‌డ్డాయి. అంతేకాదు.. మంగ‌ళ‌వారం ప్ర‌ధాని రాష్ట్రంలో ప‌ర్య‌టించిన రోజే.. రేవంత్ ఇంత దూకుడుగా ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఎదురు మాట్లాడే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది.

భూపాల‌ప‌ల్లి జిల్లా భూపాల ప‌ల్లిలో నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ జ‌న‌జాత‌ర స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర‌స్తాయిలో కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “మోడీ వ‌చ్చిండు.. ఏమిచ్చిండు.. అంటే.. ఇదిగో క‌ర్ణాట‌క‌కు చెంబు.. ఏపీకి మ‌ట్టి, చెంబుడు నీళ్లు(రాజ‌ధాని స‌మ‌యంలో తీసుకువ‌చ్చిన‌వి), తెలంగాణ‌కు గాడిద గుడ్డు” అని త‌న నెత్తిన పెట్టుకున్న‌వాటిని తీసి చూపించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు.. “తెలంగాణకు ఈ గుడ్డు ఇచ్చినందుకు బీజేపీకి ఓటు వేయాలా?” అని చేతిలో గుడ్డును ప్ర‌జ‌ల‌కు చూపిస్తూ.. నిల‌దీశారు.

రాష్ట్రంలో ఏం చేయాల‌న్నా.. అడ్డుకుంటున్నార‌ని మోడీని దుయ్య‌బ‌ట్టారు. వ‌రంగ‌ల్‌కు ఔట‌ర్ రింగ్ రోడ్డు వేయాల‌నేది ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ, మోడీ అడ్డుకుంటున్నార‌ని తెలిపారు. “ఇప్పుడు నాకు స‌మ‌న్లు ఇచ్చిన్రు. ఎందుకు?  వారిని డ‌బ్బులియ్య‌మ‌ని అడుగుతున్న క‌దా! అందుకే నాపై కేసులు పెట్టిన్రు” అని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ మ‌ళ్లీ వ‌స్తే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజ‌ర్వేష‌న్లు ఉండ‌వ‌ని చెప్పారు. “రాజ్యాంగాన్ని మార్చుడు ఖాయం.. రిజ‌ర్వేష‌న్లు రద్దు చేయుడు ఖాయం. అందుకే 400 సీట్లు అడుగుతున్న‌రు. ఇస్త‌రా?  ఇస్తే.. ఈ దేశం నుంచి పారిపోవాల్సిందే” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.