ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ తరఫున, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ తరఫున, ఎన్నికల ప్రచారంలో భాగమన్నట్టుగా ఓ వీడియో విడుదల చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, ఆ ఇద్దరికీ మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

తాజాగా, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా, మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు తీసుకున్నారు. మరికొంతమంది అభ్యర్థులూ చిరంజీవి ఆశీస్సుల కోసం హైద్రాబాద్‌కి క్యూ కడుతున్నారు. వీరంతా కూటమి అభ్యర్థులే. బీజేపీ, జనసేన అభ్యర్థులే చిరంజీవి నుంచి ఆశీస్సుల కోసం వెళుతున్నారు.

మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వున్నారు. అయితే, తన తమ్ముడికి తనవైపు నుంచి మోరల్ సపోర్ట్‌తోపాటు, ఆర్థికంగానూ అండదండలు అందిస్తున్నారు చిరంజీవి. అంతేనా.? ఎన్నికల ప్రచారంలో కూడా చిరంజీవి పాల్గొంటారా.?

చిరంజీవి, పిఠాపురం నియోజకవర్గంలో ఏదో ఒక రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయమై ఖచ్చితమైన సమాచారం ఏదీ తన వద్ద లేదని నాగబాబు తాజాగా ప్రకటించేశారు. వరుణ్ తేజ్, తాజాగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ ఇంకా పెదవి విప్పలేదు. అల్లు అర్జున్ కూడా ప్రస్తుతానికి మౌనం దాల్చాడు. ముందు ముందు, వీరంతా, ‘జై జనసేన’ అని నినదించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాగా, చిరంజీవి ఓ నాలుగైదు నియోజకవర్గాల్లో జనసేన తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయంటూ అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ విషయమై కాస్త స్పష్టత రావాల్సి వుంది.