ఏసిబి జోరుకు హైకోర్టు బ్రేక్.. తాత్కాలికమా ? శాశ్వతమా ?

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఎటువంటి విచారణ జరపకుండా హైకోర్టు బ్రేకులు వేసింది. టిడిపి హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసి దమ్మాలపాటి శ్రీనివాస్ పైన ఏసిబి కేసు నమోదు చేసింది. అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం ద్వారా అనుచితమైన లబ్దిపొందారన్నది ఏసిబి అభియోగం.

ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన దమ్మాలపాటి సుమారు 45 ఎకరాలను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలతో కూడిన కేసు ఇది. అయితే ఏసిబి చర్యను ముందే ఊహించిన దమ్మాలపాటి హైకోర్టులో ఓ పిటీషన్ వేశారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించే అవకాశాలున్నాయంటూ పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దర్యాప్తుసంస్ధల తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కావాలంటూ తన పిటీషన్లో వాదించారు.

దమ్మాలపాటి దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు మంగళవారం రాత్రి విచారించిన తర్వాత ఏసిబి దర్యాప్తును నిలిపేయాలంటూ ఆదేశాలు జారిచేసింది. ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దమ్మాలపాటి + ఆయన కుటుంబసభ్యులతో పాటు సుప్రింకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న కీలకమైన వ్యక్తి ఇద్దరు కూతుళ్ళు, మరికొందరి పేర్లు కూడా ఉన్నాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దమ్మాలపాటి తన విషయంలో మాత్రమే దర్యాప్తుసంస్ధల విచారణను అడ్డుకోవాలని కోరారు. కానీ కోర్టు మాత్రం ఎఫ్ఐఆర్ లో పేర్లున్న అందరిపైనా విచారణను నిలిపేసింది. హైకోర్టు తాజా ఆదేశాల కారణంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ దర్యాప్తుకు తాత్కాలిక బ్రేక్ పడినట్లే అనుకోవాలి. మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.