గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు 

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన డబ్బులు ఎన్నో తెలుసా ? ఏకంగా రూ.101 కోట్లు. దేశంలో అన్ని పార్టీలు రూ.390 కోట్లు ఖర్చు చేయగా అందులో బీజేపీ వాటా రూ.101 కోట్లు. మొత్తంగా ఇందులో బీజేపీ వాటా 26 శాతం కావడం గమనార్హం. గత నాలుగు మాసాలలో బీజేపీ 80,667 గూగుల్‌ రాజకీయ ప్రకటనల కోసం రూ. రూ.39,41,78,750 ఖర్చు చేసింది.

ముఖ్యంగా  ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ కోట్ల రూపాయలు కుమ్మరించింది.  ఒక్కో రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల కంటే ఎక్కువే ప్రకటనల రూపంలో ఖర్చుపెట్టినట్లు గూగుల్‌ ఇన్‌సైట్స్‌ స్పష్టం చేసింది. యూపీలో 3.38 కోట్లు, లక్షద్వీప్‌లో 5 కోట్లను ఖర్చు చేయడం విశేషం. మొత్తం 39.4 కోట్లలో 75 శాతం గూగుల్‌ వీడియో ప్రకటనలకు, 9.58 కోట్లు చిత్ర ప్రకటనల కోసం ఖర్చు చేశారు.   

ఇక లోక్‌సభ ఎన్నికల రెండో దశ ప్రచారంలో భాగంగా గూగుల్‌ యాడ్స్‌పై ఖర్చు పెట్టడంలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీని మించిపోయింది. ఈనెల 18 నుంచి 24 మధ్య రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలు, పాలసీలు, తదితర అంశాలను గూగుల్‌పై ప్రచారం చేసుకొనేందుకు గూగుల్‌ యాడ్స్‌పై రూ.14 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో కాంగ్రెస్‌ రూ.5.7 కోటు, తర్వాతి స్థానంలో బీజేపీ రూ.5.3 కోట్లు ఖర్చు చేశాయి. కర్ణాటకలో బీజేపీ అధికంగా, కేరళలో కాంగ్రెస్ అధికంగా ఖర్చుపెట్టాయి.  కర్ణాటకలో బీజేపీ అధికంగా ఖర్చు చేయగా.. కాంగ్రెస్‌ ప్రధానంగా కేరళపై దృష్టి పెట్టింది. 

మహారాష్ట్ర, బీహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఖర్చు చేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ 11 వరకు కాంగ్రెస్ 736 ఆన్‌లైన్‌ యాడ్స్‌ కోసం రూ.8.12 కోట్లు ఖర్చు చేసింది. గూగుల్‌ యాడ్స్‌పై వ్యయంలో రూ.45 కోట్లతో  కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో రూ.42 కోట్లతో డీఎంకే ఉన్నది.