చేతిలో రూ.20 వేలుతో పిఠాపురంలో నామినేష‌న్‌.. !

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో ఆస‌క్తికర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేష‌న్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతా విశ్వ‌నాథ్ రెండు సెట్లు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌.. నాలుగు సెట్ల నామినేష‌న్లు వేశారు. ఇక‌, మిగిలిన వారంతా చిన్న చిత‌కా పార్టీల‌కు చెందిన వారు కాగా.. ఇత‌రులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒక‌రు స్థానికంగా చెప్పులు కుట్టుకునే అభ్య‌ర్థి ఉండ‌డం గ‌మ‌నార్హం.

పిఠాపురంలోని సీత‌య్య‌గారి తోట‌కు చెందిన ఏడిద భాస్క‌ర‌రావు.. రెండు ద‌శాబ్దాలుగా చెప్పులు కుట్టుకుం టూ.. జీవ‌నం సాగిస్తున్నారు. ఇంట‌ర్ వ‌రకు రెగ్యుల‌ర్‌గా చ‌దివిన భాస్క‌ర‌రావు.. త‌ర్వాత డిస్టెన్స్ ఎడ్యుకే ష‌న్ ద్వారా.. పొలిటిక‌ల్ సైన్స్‌లో పీజీ చేశారు. తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో ఆయ‌న పిఠాపురం నియో జక‌వ‌ర్గంలో ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేశారు. నామినేష‌న్ ప‌త్రంలో తాను ఎంఏ చ‌ద‌వినట్టు పేర్కొన్నారు. త‌న ఆస్తులు రూ.ల‌క్ష వ‌ర‌కు ఉన్నాయ‌ని, చేతిలో రూ.20 వేలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు.

ఇక‌, త‌న వృత్తిని చెప్పులు కుట్టుకునే వృత్తిగా పేర్కొన్నారు. స్థానిక ప్ర‌బుత్వ కాలేజీ వ‌ద్ద ఉన్న చెట్టు కిందే త‌న వృత్తిని రెండు ద‌శాబ్దాలుగా కొన‌సాగిస్తున్న‌ట్టు 46 ఏళ్ల ఏడిద భాస్క‌ర‌రావు పేర్కొన్నారు. అయితే.. ఈయ‌న నామినేష‌న్ తిర‌స్క‌రిస్తారా. లే క కొన‌సాగిస్తారా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జాస్వామ్యంలో పోటీ చేసే హ‌క్కును ఆయ‌న సంపూర్ణంగా వినియోగించుకుంటుండ‌డం ప‌ట్ల యువ‌త స‌హా అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఆయ‌న ఎక్క‌డా ప్ర‌చారం చేసుకోవ‌డం లేదు. త‌న‌ను క‌లిసి మీడియాకు మాత్రం ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. త‌న‌ను గెలిపిస్తే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని చెబుతున్నారు. త‌న వెనుక ఏ పార్టీ ప్రోత్సాహం లేద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.