ఎవ‌రెంత చెప్పినా ఆ నేత‌ను వ‌ద‌ల‌ని కేసీఆర్

అధికారంలో ఉన్న‌ప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్క‌సారి అధికారం చేజారితే పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారుతుంది. ఇప్పుడు తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప‌రిస్థితి కూడా అలాగే మారింది. ఓ వైపు కారు దిగి హ‌స్తం గూటికి వెళ్తున్న నేత‌లు.. మ‌రోవైపు బీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త విభేదాలు. గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓట‌మికి కేసీఆర్ కోట‌రీనే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లున్నాయి. కేవ‌లం కొంత‌మంది నాయ‌కుల మాట‌ల‌ను మాత్ర‌మే కేసీఆర్ ప‌ట్టించుకుంటార‌ని, అదే కొంప‌ముంచింద‌ని శాస‌న‌మండలి ఛైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఇటీవ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే జ‌గ‌దీశ్‌రెడ్డిని ఉద్దేశించే ప‌రోక్షంగా గుత్తా ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని తెలిసింది.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌గ‌దీశ్‌రెడ్డికి తిరుగులేదు. ఇదీ.. ఆయ‌న‌, ఆయ‌న వ‌ర్గం నేత‌లు అనుకునే మాట‌. కానీ వాస్త‌వ ప‌రిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.  గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌ల్గొండ‌లో జ‌గ‌దీశ్‌రెడ్డి మిన‌హా మిగ‌తా బీఆర్ఎస్ అభ్య‌ర్థులంద‌రూ ఓడిపోయారు. ఈ అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగ‌రేసింది. తెలంగాణ ఏర్ప‌డ్డాక జ‌రిగిన తొలి రెండు ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి న‌ల్గొండ‌లో బీఆర్ఎస్‌కు మంచి ఫ‌లితాలు వ‌చ్చాయి. అక్క‌డి ప్ర‌జ‌లు కేసీఆర్కు మ‌ద్ద‌తుగా నిలుస్తూనే వ‌చ్చారు. కానీ గ‌త ఎన్నిక‌ల్లో స‌డెన్‌గా సీన్ రివ‌ర్స్ కావ‌డానికి జ‌గ‌దీశ్‌రెడ్డి వైఖ‌రే కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

జూనియ‌ర్ కేసీఆర్‌గా మారిన జ‌గ‌దీశ్‌రెడ్డి జిల్లాలో త‌న పెత్త‌నం మాత్ర‌మే సాగాల‌ని ప‌ట్టుబ‌డ‌తార‌నే టాక్ వినిపిస్తోంది.  దీంతో ఇత‌ర నాయ‌కుల‌కు ప్రాధాన్యం ద‌క్క‌క‌, పార్టీ కోసం ప‌నిచేసేందుకు ముందుకు రాక‌పోవ‌డంతోనే బీఆర్ఎస్‌కు షాక్ త‌గిలింద‌ని తెలిసింది. తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్ మంత్రివ‌ర్గంలో మంత్రిగా కొన‌సాగిన జ‌గ‌దీశ్‌రెడ్డి అంతా తానే అనే భ్ర‌మ‌ల్లో ఉంటార‌నే విమ‌ర్శ‌లున్నాయి. త‌న‌వల్ల‌నే పార్టీ గెలుస్తుంద‌నే అతి విశ్వాసం ప్ర‌ద‌ర్శించార‌ని చెబుతుంటారు.

కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఓ స్థాయి నేత‌ల‌నూ కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించ‌డంతో జ‌గ‌దీశ్‌రెడ్డిపై బీఆర్ఎస్‌లోనే అసంతృప్తి బాగా పెరిగిపోయింద‌ని టాక్‌. ఇలాంటి ప‌రిణామాలు జ‌రుగుతున్నా, ఎవ‌రెంత చెప్పినా కానీ జ‌గ‌దీశ్‌రెడ్డిని వ‌దులుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేర‌ని తెలిసింది. తెలంగాణ ఉద్య‌మం నుంచి త‌న‌తో పాటు ఉన్న జ‌గ‌దీశ్‌రెడ్డికి కేసీఆర్ ప్రాధాన్య‌త ఇస్తూనే ఉన్నారు. అందుకే లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బ‌స్సుయాత్ర‌ను కూడా ఉమ్మ‌డి న‌ల్గొండ నుంచే ప్రారంభించేందుకు సిద్ధ‌మ‌య్యారు.