మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు తుందేమో కానీ.. ఆయ‌న‌కు మాత్రం ఎక్క‌డా విసుగ‌నిపించ‌దు!. అయితే.. ఇటీవ‌ల కాలంలో కొంత త‌గ్గించార‌నుకోండి. అయినప్ప‌టికీ మీడియా స‌మావేశాలు.. స‌భ‌ల్లో ఇప్ప‌టికీ.. మైకుపై చంద్ర‌బాబుయుద్ధ‌మే చేస్తున్నార‌ని త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతుంటారు. కాగా.. తాజాగా అంతర్జాతీయ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు కెమెరా అందుకున్నారు. చిత్రంగా అనిపించినా నిజ‌మే!.

నిత్యం మీడియా మిత్రుల‌తో పిచ్చాపాటీ మాట్లాడ‌డ‌మే కాకుండా.. ప్రెస్‌మీట్లు నిర్వ‌హించే సీఎం.. కెమెరామెన్ల‌కు కూడా తల్లో నాలుక‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్కించుకుని బుధ‌వారం సాయంత్రం త‌న‌ను క‌లిసి కెమెరామెన్లు(ఫొటో జ‌ర్న‌లిస్టులు), మీడియా ప్ర‌తినిధుల‌తో చంద్ర‌బాబు స‌ర‌దాగా ముచ్చ‌టించారు. ఫొటో జ‌ర్న‌లిస్టుల నుంచి కెమెరా తీసుకుని త‌నే కొన్ని ఫొటోల‌ను క్లిక్ మ‌నిపించ‌డం విశేషం. ఇక్క‌డ మ‌రో చిత్రం ఏంటంటే.. నిత్యం త‌న ఫొటోలు తీసే కెమెరామెన్ల ఫొటోల‌ను చంద్ర‌బాబు తీయ‌డం!!.

సుమారు 20 నిమిషాల‌కు పైగా వివిధ కోణాల్లో జ‌ర్న‌లిస్టుల‌ను కూడా ఫొటోలు తీసి సంతోషం వ్య‌క్తం చేశారు. అంత‌ర్జాతీయ ఫొటో గ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు. చ‌రిత్ర‌ను రికార్డు చేయ‌డంతోపాటు.. అరుదైన జ్ఞాప‌కాల‌ను భ‌ద్ర‌ప‌రిచే ఫోటోగ్ర‌ఫీ వృత్తిలో ఉన్న‌వారికి అభినంద‌న‌లు అంటూ వ్యాఖ్యానించారు. ఫొటో జ‌ర్నలిస్టుల‌ అంకితభావం, కళాత్మక ప్రతిభ.. అంద‌రినీ ఆక‌ర్షిస్తాయ‌ని పేర్కొన్నారు. కాగా.. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జ‌ర్న‌లిస్టులు.. తాము ఫీల్డ్‌లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను చంద్ర‌బాబుకు వివ‌రించారు. వీటిని సాధ్య‌మైనంత వేగంగా ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.