ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్థాప్ పెట్టారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ స్థాయికి చేరుకొన్న ఆయన అత్యంత కీలకంగా వ్యవహారించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పారు. వైసీపీ పార్టీలోనే కాకుండా జగన్ కేసుల్లో కూడా విజయసాయి వున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయనకు జగన్ కు మధ్య ఎక్కడో చెడింది. దాంతో ఆయన రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు.
రాజకీయాలకు కొంతకాలం దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ అడపా దడపా సోషల్ మీడియాలో పొలిటికల్ కామెంట్స్ తో దుమారం రేపుతూ వస్తున్నారు. కొంతకాలం వైసీపీ మీద పరోక్ష విమర్శలు గుప్పించారు. దాంతో ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. టీడీపీలో చేరడానికి చర్చలు జరుతున్నట్లు గుసగుసలు వినిపించాయి. సీఎం చంద్రబాబు ఆయనను పార్టీలోకి తీసుకుందుకు ఇష్టపడలేదని సమాచారం. అంతలోనే కథ యూ టర్న్ తిరిగింది. అంతలోనే మళ్ళీ కొత్త ప్రచారం ఊపండుకుంది. విజయసాయి బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది.
విజయసాయి కూడా బీజేపీకి ఇష్టమైన రీతిలో హిందుత్వ ఎజెండా బేస్ గా ప్రకటనలు ఇవ్వడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. రేపో మాపో బీజేపీ కండువా కప్పుకుంటారని అనుకుంటున్న తరుణంలో విజయసాయి మళ్ళీ వైసీపీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు మీడియాలో వైరల్ అయ్యింది.
ఇన్ని రకాల ఊగిసలాటల తర్వాత విజయసాయి సొంత పార్టీ పెట్టడానికే నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ప్రజా వాణిని వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు, లక్ష్యాల గురించి త్వరలో విజయవాడ వేదికగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ప్రకటన వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతోంది. టీడీపీ సానుభూతి పరులు విజయసాయి పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం లేదు. అయితే గియితే వైసీపీ, కాంగ్రెస్ శ్రేణులే అటువైపు అడుగులు వేయొచ్చు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్లకు భారీ గండి పడే అవకాశాలు కూడా వున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates