బొత్స వారసురాలి రాజకీయ రంగ ప్రవేశం

మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది ఉన్నారు. తాతల, తండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మహిళా నేతల జాబితా పెద్దదే. తాజాగా ఆ జాబితాలోకి ఏపీలోని సీనియర్ పొలిటిషియన్లలో ఒకరైన మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూతురు బొత్స అనూష చేరారు. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ స్వయంగా ప్రకటించారు.

బొత్స అనూష ఈ మధ్య వైసీపీ చేపట్టే ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో, అనూష పొలిటికల్‌ ఎంట్రీపై ఉత్తరాంధ్రలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, అఫీషియల్ గా మాత్రం ఈ రోజు ఆ ప్రచారం నిజమేనని బొత్స ప్రకటించారు.

శాసన మండలి సమావేశాల్లో వాడీవేడి చర్చకు కేంద్ర బిందువైన బొత్స ఈ రోజు మీడియాతో జరిగిన చిట్‌చాట్‌ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. అనూషను తన రాజకీయ వారసురాలిగా బొత్స ప్రకటించారు. అంతేకాదు, త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో విజయనగరం జడ్పీ చైర్మన్ స్థానానికి ఆమె పోటీ చేయబోతున్నారని కూడా ప్రకటించారు.

బొత్స అనూష ఉన్నత విద్యనభ్యసించారు. ఎంబీబీఎస్/ఎండీ చేసిన అనూష వైద్య వృత్తిలో ఉన్నారు. నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆల్రెడీ బొత్స ఫ్యామిలీ నుంచి పలువురు క్రియాశీలకంగా ఉన్నారు. బొత్స కుటుంబం నుంచి మరో తరం పొలిటిషియన్ గా అరంగేట్రం చేయబోతున్న అనూష తన ప్రస్థానంలో తండ్రిని మించిన తనయురాలిగా గుర్తింపు తెచ్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.