వైఎస్ వ్యతిరేకిస్తే .. జగన్ ముద్దాడుతున్నాడు

లోక్ సభ ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుండి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అసలు పోటీ చేయకుండానే జెండా ఎత్తిన షర్మిల ఆంధ్రా రాజకీయాల్లో విజయం సంగతి ఏమో గానీ జగన్ కు నష్టం చేయడం గ్యారంటీ అని భావిస్తున్నారు.

ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో బీజేపీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని, కానీ  బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ గులాంగిరీ చేస్తున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. బాపట్ల జిల్లా అద్దంకిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తే, ఆయన కొడుకైన జగన్ బీజేపీని ముద్దాడుతున్నాడని, పార్లమెంటులో ఏ బిల్లు ప్రవేశపెట్టినా జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇచ్చాడని షర్మిల ధ్వజమెత్తారు.

ఆఖరికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంటే జగన్ అడ్డుకోవడం లేదని,  వైఎస్ కుమారుడిగా ఆయన ఆశయాలను జగన్ ఎలా నిలబెట్టినట్లని షర్మిల ప్రశ్నించారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అని, జగన్ పాలనలో దండుగ అని విమర్శించారు.

రాష్ట్రంలో పంటకు మద్దతు ధర ఉందా? పొలంలో డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ పై సబ్సిడీ ఉందా? యంత్రాలపై సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పరిహారం ఉందా? రైతన్న అనే వాడికి గౌరవం ఉందా? రైతులు మొత్తం అప్పులపాలు కాలేదా? అయినా జగన్ మోహన్ రెడ్డి ఏమాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల విజయం సంగతి పక్కనపెడితే జగన్ కు ఎంత వరకు డ్యామేజీ చేస్తుందో అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.